అంతమంది ఉన్నారు.. హైప్ ఏదీ?

కాజల్ అగర్వాల్.. నిత్యా మీనన్.. రెజీనా కసాండ్రా.. ఈషా రెబ్బా.. అవసరాల శ్రీనివాస్.. ప్రియదర్శి.. ఇంతమంది పేరున్న నటీనటులున్నారు ‘అ’ సినిమాలో. ఇంకా నాని, రవితేజ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. నానీనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. వెరైటీ ప్రోమోలతో ఈ సినిమా బాగానే ఆసక్తి రేకెత్తించింది.

కానీ ఈ చిత్రానికి విడుదల ముంగిట ఆశించిన స్థాయిలో హైప్ అయితే రాలేదు. అంతమంది తారలు అందుబాటులో ఉన్నా ఈ చిత్రాన్ని సరిగ్గా ప్రమోట్ చేయడంలో సక్సెస్ కాలేదు నాని. ఈ చిత్ర బృందం నుంచి ఎవ్వరూ కూడా మీడియాకు ఇంటర్వ్యూలివ్వలేదు. ప్రమోషనల్ ఈవెంట్లు కూడా పెద్దగా కనిపించట్లేదు.

ఎప్పుడో రెండు వారాల కిందట ప్రి రిలీజ్ ఈవెంట్ ఒకటి చేశారు. అప్పుడు ఈ సినిమా గురించి బాగానే చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రమోషన్లు లేవు. అప్పుడు ఆడియో వేడుక చేసి.. రిలీజ్ ముంగిట ప్రి రిలీజ్ ఈవెంట్ చేసి ఉంటే సినిమాకు కలిసొచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి కాజల్ సహా చాలామంది నటీనటులు సపోర్ట్ చేశారు. మరి వాళ్లు ప్రమోషన్లకు కూడా వస్తే.. మీడియాకు ఇంటర్వ్యూలిచ్చి సినిమా గురించి మంచి ముచ్చట్లు చెప్పి జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తే మంచి ఫలితం ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నాలు పెద్దగా జరగలేదు. దీంతో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

దీనికి పోటీగా రిలీజవుతున్న ‘మనసుకు నచ్చింది’ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. కాకపోతే సినిమాకు కాస్టింగ్ విషయంలో పెద్ద ఆకర్షణేమీ లేదు. కానీ ఇక్కడ అంత మంది తారలున్నారు. నిర్మాతగా నాని ఉన్నాడు. మరి ఇంతమంది ఉన్నా సినిమాకు హైప్ తేకపోవడమేంటి?