ఈసారి కూడా బ్రహ్మికి హ్యాండే

మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాల్లో హవా సాగించాడు బ్రహ్మానందం. ఐతే ఆయన కెరీర్లో ఇప్పుడున్నంత స్లంప్ ఎప్పుడూ లేదు. కమెడియన్‌గా కొంచెం పేరు తెచ్చుకున్నప్పటి నుంచి బ్రహ్మి బిజీగానే ఉంటూ వచ్చాడు. మధ్యలో 2000 సంవత్సరం తర్వాత కాస్త జోరు తగ్గింది. వేణుమాధవ్, సునీల్ లాంటి కమెడియన్లు రైజ్ కావడంతో బ్రహ్మికి కొంచెం డిమాండ్ తగ్గింది.

అలాంటి సమయంలో ఆయన కెరీర్‌ను మళ్లీ పైకి లేపి.. తిరుగులేని స్థాయి తీసుకెళ్లిన దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకడు. ‘ఢీ’.. ‘రెడీ’.. ‘కింగ్’.. ‘ఓం నమో వేంకటేశాయ’.. ‘బాద్ షా’ లాంటి సినిమాల్లో బ్రహ్మికి తిరుగులేని క్యారెక్టర్లు ఇచ్చి తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాడు వైట్ల. ఆ సినిమాలు మంచి ఫలితాలనందుకోవడంలో బ్రహ్మి పాత్ర కీలకమని చెప్పాలి. ఐతే ఈ క్రేజీ కాంబో తర్వాత దారి తప్పింది.

ఇటు వైట్ల కథలు.. అటు బ్రహ్మి పాత్రలు రొటీన్‌గా తయారై ప్రేక్షకులకు మొహం మొత్తింది. దీంతో వైట్ల బ్రహ్మికి టాటా చెప్పాడు. అలాగని వైట్ల పరిస్థితేమీ మారలేదు. బ్రహ్మి లేకుండా చేసిన ‘మిస్టర్’ దారుణమైన ఫలితాన్నే అందుకుంది. ఇప్పుడు వైట్ల.. రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ బ్రహ్మికి పాత్ర ఇవ్వలేదు వైట్ల.

ఈ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ కమెడియన్లతో షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడతను. అందులో వెన్నెల కిషోర్.. రఘుబాబు తదితరులున్నారు. ఈ ఫొటోలోనే కాదు.. సినిమాలోనూ బ్రహ్మి లేడట. బ్రహ్మి వల్లే సినిమాలు రొటీన్ అయిపోతున్నాయన్నట్లుగా ఆయన్ని పక్కన పెట్టేసినట్లున్నాడు వైట్ల. త్రివిక్రమ్ సైతం బ్రహ్మి విషయంలో ఇలాగే చేస్తున్నాడు. ఐతే దర్శకులు రొటీన్ పాత్రలిచ్చి బ్రహ్మి కెరీర్‌ను పక్కదోవ పట్టించేసి.. ఇప్పుడు ఆయన కామెడీని నెగెటివ్ సెంటిమెంటుగా భావించి పాత్రలివ్వకపోవడం బ్రహ్మి అభిమానుల్ని బాధిస్తోంది.