కరోనా ఎఫెక్ట్.. ‘సరిలేరు’కు సెన్సేషనల్ రేటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు గత సినిమా ‘మహర్షి’ థియేటర్లలో బాగానే ఆడినా.. టీవీల్లోకి వచ్చేసరికి డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు మహేష్ కెరీర్లోనే అత్యల్ప రేటింగ్ వచ్చింది. దీంతో మహేష్ కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’కు టీవీల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ సినిమాకు సెన్సేషనల్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇటీవలే జెమిని టీవీలో ‘సరిలేరు..’ ప్రిమియర్ వేశారు.

మహేష్ కెరీర్లోనే అత్యధికంగా ‘సరిలేరు..’కు ఏకంగా 23.4 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు సమాచారం. ఇది టాలీవుడ్ చరిత్రలోనే టాప్-3 టీఆర్పీ కావడం విశేషం. ‘బాహుబలి’కి సైతం ఈ రేటింగ్ రాలేదు. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక టీఆర్పీ తెచ్చుకున్న సినిమా ‘శ్రీరామదాసు’. దీనికి అప్పట్లో 24 రేటింగ్ వచ్చింది. టెంపర్’ 23.5 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. ‘శ్రీమంతుడు’ 22.4 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంది.

తన సినిమానే వెనక్కి నెట్టి ‘సరిలేరు..’ను మూడో స్థానంలో నిలబెట్టాడు మహేష్. ఐతే ఒకప్పుడు 20 ప్లస్ రేటింగ్ అనేది మామూలుగానే అనిపించేది కానీ.. గత కొన్నేళ్లలో రేటింగ్స్ బాగా పడిపోయాయి. టీవీల కంటే ముందు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో సినిమాలు ప్రదర్శితం అవుతుండటం టీఆర్పీల మీద ప్రభావం చూపుతోంది. 15కు అటు ఇటుగా రేటింగ్ వస్తే గొప్ప అనుకుంటున్నారు. ఐతే కరోనా ఎఫెక్ట్‌తో లాక్ డౌన్ కారణంగా జనాలు ఇంటి పట్టునే ఉంటున్న సమయంలో ‘సరిలేరు..’ ప్రిమియర్ పడటంతో దీనికి ఇంత భారీ రేటింగ్ వచ్చినట్లు అర్థమవుతోంది.