కరోనా పైత్యం.. అవసరమా అనసూయా ఈ ‘అతి’.!

ఒక్క అనసూయ భరద్వాజ్‌కి మాత్రమే ‘లాక్‌ డౌన్‌’ కారణంగా సమస్య వచ్చి పడిందా.? స్టార్‌ హీరోల దగ్గర్నుంచి, సినీ, టీవీ రంగాల్లో పని చేసే కార్మికులదాకా.. ప్రతి ఒక్కరికీ ఆ సమస్య వుంది. ఆ మాటకొస్తే, ప్రతి సామాన్యుడూ సమస్యని ఎదుర్కొంటాడు ‘లాక్‌ డౌన్‌’ కారణంగా. కానీ, లాక్‌ డౌన్‌ ఎందుకోసం.? వైరస్‌ని నియంత్రించడానికి వేరే మార్గం లేదు. 130 కోట్ల మంది జనం వున్న భారతదేశంలో, వైరస్‌ గనుక అనూహ్య స్థాయిలో వ్యాప్తి చెందితే.. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా తయారవుతుందో ఊహించలేం.

ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ త్యాగాలకు సిద్ధమవ్వాలి. అందుకే, ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ నిర్ణయాలు తీసుకున్నాయి. లాక్‌ డౌన్‌ అంటే, సాధారణ ప్రజానీకానికి నరకమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, తప్పదు. ప్రభుత్వం, కొంత మేర ఆర్థిక సహాయం అందించడంతోపాటు, కొన్ని ఉపశమన చర్యలూ చేపడుతుండడాన్ని అభినందించాలి. డబ్బున్నోడు, పది మంది లేనోళ్ళకు సాయం చేసి ‘మనిషి’ అన్పించుకోవడానికి ఇదే కీలకమైన సందర్భం. అంతేగానీ, ‘మేం మా పని చేసుకోకపోతే, మా ఈఎంఐ ఎలా కట్టుకోగలం.? ఇంటి అద్దె చెల్లించేది ఎలా.? మా మెయిన్‌టెనెన్స్‌ ఎలా గడుస్తుంది.?’ అని ప్రశ్నించడమా.? ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటుండదు.

బ్యాంకుల్ని నడిపేది కూడా మనుషులే.. ఇళ్ళను అద్దెకి ఇచ్చేది కూడా మనుషులే. ఏమో, ముందు ముందు బ్యాంకుల నుంచి ఉపశమనాలు, రెంటు చెల్లింపుల నుంచి కొంత ఊరట దక్కుతాయేమో. ఆ దిశగా ఆలోచించాలి తప్ప, ‘లాక్‌ డౌన్‌’ని ప్రశ్నిస్తే ఎలా.? ఇది ప్రశ్నించే సందర్భం కాదు, ప్రభుత్వాలకు పూర్తిస్థాయిలో మద్దతివ్వాల్సిన సందర్భం. జన జీవనం స్తంభించిపోతే, ప్రభుత్వాలు ఆర్థికంగా చాలా నష్టపోతాయి. అయినా, ప్రభుత్వం లాక్‌ డౌన్‌కి సిద్ధపడిందంటే.. పరిస్థితి తీవ్రత ఏంటనేది అర్థమవుతోంది.

ఇక, అనసూయ సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై పెను దుమారమే రేగుతోంది. ‘ఇలాంటి సెలబ్రిటీలను తొలుత కట్టడి చేయండి..’ అంటూ కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. పబ్లిసిటీ కోసమే అనసూయ ఇదంతా చేసిందా.? పైగా, ఆమె ‘అతి’ని ప్రశ్నిస్తోన్నవారిని ‘మూర్ఖులుగా’ చిత్రీకరించడమా.? సిగ్గు సిగ్గు.. అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.