కొడుకు హీరోయిన్లే కాదు.. సెట్స్ కూడా

మెగాస్టార్ చిరంజీవి మరీ కుర్రాడు అయిపోతున్నారు. దాదాపు దశాబ్ద కాలం బ్రేక్ తీసుకుని ఖైదీ నంబర్ 150 అంటూ రీఎంట్రీలోనే.. మొత్తం రికార్డులను దులిపేశారు. అఫ్ కోర్స్.. ఇవి రంగస్థలం కారణంగా చెరిగిపోయినా.. తెలుగు మాస్ కమర్షియల్ మూవీకి 100 కోట్ల షేర్ రాబట్టగల సత్తా ఉందని ప్రూవ్ చేశారు మెగాస్టార్.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. రామ్ చరణ్ తో ఈ బ్యూటీ 4 సినిమాలలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైరా అంటూ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాను చకచకా చేసేస్తున్నారు చిరంజీవి. తన కొడుకు రామ్ చరణ్ తో ధృవ సినిమా తీసిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. ఈ సైరా నరసింహారెడ్డి చిత్రానికి దర్శకుడు. అలా తన కొడుకుతో సినిమా తీసిన దర్శకుడిని తీసుకొచ్చారు చిరు. అక్కడితో ఏమీ ఆగలేదు. సైరాలో ఓ హీరోయిన్ అవకాశాన్ని తమన్నా భాటియాకు ఇచ్చారు. సైరాలో మిల్కీ ఎంట్రీ ఇప్పటికే అధికారికం అయిపోయింది కూడా.

దర్శకుడు.. హీరోయిన్స్.. మాత్రమే కాకుండా.. కొడుకు సినిమా కోసం వేసిన సెట్స్ ను కూడా ఉపయోగించేసుకుంటున్నారు చిరంజీవి. రంగస్థలం మూవీ కోసం హైద్రాబాద్ లోనే ఓ గ్రామం సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఆ సెట్ కు కొన్ని మార్పు చేర్పులు చేసి.. మరో దశాబ్దం క్రిందటి ఊరు అనిపించేలా చేసి.. సైరా షూటింగ్ పార్ట్ నిర్వహిస్తున్నారట మెగాస్టార్. రంగస్థలం సెట్ ను కొన్ని వారాల క్రితమే హ్యాండోవర్ చేసుకుంది సైరా టీం.