క్రిష్ సినిమాకు 200 కోట్లా?

లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే బాలీవుడ్లో అయినా ఓ వంద కోట్లు పెట్టడానికి సందేహిస్తారు. ‘పద్మావత్’ హీరోయిన్ పేరు మీద తీసిన సినిమానే కానీ.. అది హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం అయితే కాదు. దానికి కూడా బడ్జెట్ వంద కోట్ల లోపే అయింది. అందులో రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ లాంటి స్లార్ హీరోలున్న సంగతి మరువరాదు. పైగా సంజయ్ లీలా బన్సాలీ దానికి దర్శకుడు. ఐతే బాలీవుడ్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఒక పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. ఆ చిత్రం మరేదో కాదు.. మణికర్ణిక. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో మన తెలుగు దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న చిత్రమిది.

ఇప్పటిదాకా ఈ చిత్ర బడ్జెట్ రూ.60-70 కోట్ల మధ్య ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఈ చిత్ర బడ్జెట్ ఏకంగా రూ.200 కోట్లని కథానాయిక కంగనా రనౌతే స్వయంగా వెల్లడించింది. ఇండియాలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు అయిన అత్యధిక బడ్జెట్ ఇదే అని ఆమె చెప్పింది. ఈ ఖర్చుకు తగ్గ భారీతనం సినిమాలో ఉంటుందని.. ఈ చిత్రం బడ్జెట్ మీద మంచి లాభాలు కూడా అందిస్తున్న ధీమా తమకు ఉందని ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంగనా తెలిపింది.

క్రిష్ తెలుగులో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి సాహసోపేత ప్రయత్నం చేశాడు. బాలయ్య మార్కెట్ ను మించి చాలా ఖర్చే చేశాడు ఈ చిత్రానికి. కానీ పెట్టుబడి మీద లాభాలు కూడా తెప్పించాడు. మరి ‘మణికర్ణిక’ విషయంలోనూ అదే సాహసం చేయిస్తున్న క్రిష్.. ఈసారి కూడా విజయవంతమవుతాడేమో చూద్దాం.