గురూజీ చెంతకు వెళ్లిన మలయాళ రీమేక్


మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ రైట్స్ ను యువ నిర్మాత నాగవంశీ భారీ మొత్తంకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాపై ఇష్టంతో ఆయన రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై భారీ మల్టీస్టారర్ చిత్రంగా నిర్మించాలని ఆశపడ్డాడు. పలువురు హీరోలతో సంప్రదింపలు జరపడంతో పాటు తన రచయితల టీంతో తెలుగు వర్షన్ కోసం స్క్రిప్ట్ ను కూడా రెడీ చేయించాడు. కాని హీరోలు ఎవరు కూడా ఈ రీమేక్ కు ఆసక్తి చూపక పోవడంతో స్క్రిప్ట్ బాద్యతలను త్రివిక్రమ్ వద్దకు నాగవంశీ తీసుకు వెళ్లాడట.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనదైన శైలితో ఈ రీమేక్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సిద్దం చేసేందుకు ఒప్పుకున్నాడట. దర్శకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాని త్రివిక్రమ్ చేయి ఆ స్క్రిప్ట్ పై పడితే ఖచ్చితంగా పలువురు హీరోలు రీమేక్ లో నటించేందుకు ముందుకు వస్తారనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉన్న త్రివిక్రమ్ కరోనా కారణంగా ఆ ప్రాజెక్ట్ ను ఇప్పట్లో మొదలు పెట్టే అవకాశం లేదు. కనుక ఈ రీమేక్ స్క్రిప్ట్ బాధ్యతను త్రివిక్రమ్ తీసుకున్నట్లుగా అనుకుంటున్నారు.

కొన్ని రోజుల క్రితం ఈ రీమేక్ లో బాలకృష్ణ మరియు రానాలు కలిసి నటించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. కాని వారిద్దరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ బాధ్యతలు తీసుకుంటే వారిద్దరు ఓకే చెప్తారేమో చూడాలి. ఈ రీమేక్ ను వచ్చే ఏడాది సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకు వెళ్లేలా నిర్మాత నాగ వంశీ ప్రయత్నాలు చేస్తున్నాడట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.