జై సింహాకు కూడా అదనపు ఆటలు

ఇక మెల్లగా ఆంధ్రలో సినిమా హాళ్లు 24గంటలు పనిచేయడం అలవాటు చేసుకుంటాయేమో? అజ్ఞాతవాసి సినిమా కోసం రోజుకు ఇరవై నాలుగు గంటలు ఆటలు వేసుకునే వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇచ్చింది ఆంధ్ర ప్రభుత్వం. ఇప్పుడు అదే బాటలో జై సింహా సినిమా కోసం కూడా అనుమతి ఇచ్చే ఫైల్ కదిలినట్లు వార్తలు వినవస్తున్నాయి.

ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి వియ్యంకుడు అయిన బాలకృష్ణ ఈ సినిమాలో హీరో. ఈనెల 12న జై సింహా విడుదల అవుతోంది. 12 నుంచి పండుగ వెళ్లే వరకు రాత్రి ఒంటి గంట నుంచి మర్నాడు ఉదయం పది గంటల వరకు మూడు ఆటలు వేసుకునే వెసలుబాటు కల్పించే విధంగా ఆదేశాలు ఇస్తారన్నమాట.

సింగిల్ థియేటర్లు, రెండు థియేటర్లు మాత్రమే ఉన్న సెంటర్లకు ఇది ఒక విధంగా వరం లాంటిదే. పండగ టైమ్ లో అర్థరాత్రి ఆటలు, ఎర్లీ మార్నింగ్ ఆటలు వేసుకోవచ్చు. పండగకు నాలుగు సినిమాలు వున్నాయి కాబట్టి, స్క్రీన్ లు దొరకవు అన్న సమస్యే వుండదు.