డీఎస్పీ రివర్స్ పంచ్ రెడీ

పోయినేడాది దేవిశ్రీ ప్రసాద్ నుంచి చాలా ఆడియోలు వచ్చాయి. అందులో కొన్ని మంచి స్పందనే తెచ్చుకున్నాయి కానీ.. కొన్నింటిపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఏడాది చివర్లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’లో దేవిశ్రీ సంగీతంపై చాలా చర్చ నడిచింది. సినిమాకు తగ్గట్లే దేవి కూడా మరీ రొటీన్‌గా వాయించేశాడని.. అతడి ప్రత్యేకతను చూపించే ఒక్క పాట కూడా ఇందులో లేదని అన్నారు మ్యూజిక్ పండిట్స్.

బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలే వినిపించాయి. ఎప్పుడూ రొటీన్‌గా వాయించేసే థమన్ వీనుల విందైన సంగీతంతో ఆకట్టుకుంటుంటే.. అనూప్ రూబెన్స్ ‘హలో’తో తనదైన ముద్ర వేశాడు. అదే సమయంలో ‘అజ్ఞాతవాసి’తో అనిరుధ్ రవిచందర్ కూడా దూసుకొచ్చాడు.

దీంతో దేవిశ్రీ పనైపోయిందని.. అతడిలో సరుకైపోయిందని రకరకాల కామెంట్లు పడ్డాయి సోషల్ మీడియాలో. ఐతే ఈ ఏడాది ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ లాంటి ఎగ్జైటింగ్ సినిమాలు దేవిశ్రీ చేతిలో ఉండటంతో వీటితో బౌన్స్ బ్యాక్ అవుతాడని.. తనేంటో రుజువు చేస్తాడని అతడి అభిమానులు ఆశించారు. దేవిశ్రీ అందుకు తగ్గట్లే ‘రంగస్థలం’తో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్ర టీజర్లలో బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ.. ఇప్పుడు ‘ఎంత సక్కగున్నావే’ పాట కానీ గొప్ప ప్రశంసలందుకున్నాయి. ముఖ్యంగా నిన్న రిలీజైన ఈ పాట సంచలనం రేపుతోంది.