పూరి కొడుకు-పునర్జన్మల ప్రేమ

దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా పట్టుదలగా వున్నాడు. కొడుకును హీరోగా నిలబెట్టడంతో పాటు, తాను మళ్లీ సక్సెస్ బాటలో అడుగు పెట్టాలని పంతంతో వున్నాడు. అందుకే స్వీయ నిర్మాణంలో మెహబూబా సినిమా రూపొందిస్తున్నాడు. ఇండియా పాక్ బోర్డర్లలో ఎక్కువ పార్ట్ కథ జరుగుతుంది. ఇందుకోసం అక్కడ చకచకా షూటింగ్ కూడా జరిపేస్తున్నారు.

ఇదిలా వుంటే పూరి తన కొడుకు కోసం పునర్జన్మల నేపథ్యంలో కథ రాసుకున్నట్లు వదంతులు బయటకు వచ్చాయి. ఇండియా, పాక్ విభజన సమయంలో విడిపోయిన జంట, మరణించి మళ్లీ పుడితే, పూర్వ జన్మ స్మృతులు వెంటాడితే అన్న పాయింట్ తో కథ అల్లుకున్నట్లు తెలుస్తోంది. నిజమో కాదో తెలియాలంటే, పూరి సినిమా గురించి లీడ్ ఇచ్చేవరకు ఆగాలి.

తెలుగునాట అలనాటి నాగేశ్వర రావు మూగమనసులు నుంచి, రామ్ చరణ్ మగధీర మీదుగా ఆ మధ్య వచ్చిన ‘మనం’ వరకు పునర్జన్మల నేపథ్యం అన్నది తెలుగు సినిమాలకు సక్సెస్ ఫార్ములా. బహుశా అందుకే పూరి ఈసారి ఈజోనర్లోకి అడుగుపెట్టి వుంటాడు