పోటీ చెయ్యను.. ప్రచారం మాత్రమే: పోసాని

సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా అయిన పోసాని కృష్ణమురళి, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన విషయం విదితమే. ఆ ఎన్నికల్లో పోసాని ఖర్చుపెట్టింది కేవలం 7 లక్షలు మాత్రమేనట. తనకు పోటీగా నిలబడ్డ అభ్యర్థులు ఒక్కొక్కరు 10 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేశారన్నది పోసాని వాదన. అందుకే, ఇకపై ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయనని పోసాని తేల్చి చెప్పేశారు.

గత కొంతకాలంగా వైఎస్‌ జగన్‌కి మద్దతిస్తోన్న పోసాని, తనను పిలిస్తే 2019 ఎన్నికల్లో జగన్‌ కోసం వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేస్తానని చెబుతున్నారు పోసాని కృష్ణమురళి. పవన్‌కళ్యాణ్‌ పార్టీ వైపు వెళ్ళే ఆలోచన ఏమన్నా వుందా.? అని ప్రశ్నిస్తే, ‘పవన్‌ పిలిచినా వెళ్ళను.. జగన్‌ ముఖ్యమంత్రి అయి, చంద్రబాబుని మించిన పాలన అందించకపోతే, అప్పుడు ప్రశ్నిస్తా, ఇంకో పార్టీ గురించి ఆలోచిస్తా..’ అని సమాధానం చెప్పారాయన.

పోసాని అంటే ఫైర్‌ బ్రాండ్‌. తనకిలా వుండడమే ఇష్టమని చెప్పే పోసాని, మాటలు రఫ్‌గా వున్నా, ఆ మాటల్లో తప్పు దొర్లదన్నది పోసాని వాదన.