సి.కళ్యాణ్, నల్లమలుపు బుజ్జి.. ఒకప్పుడు మంచి స్నేహితులట. సినీ పరిశ్రమలో ఎవరైనా ‘స్నేహితులు’గానే వుంటారు. చిన్న చిన్న విభేదాలున్నా, ‘మేమంతా ఒక్కటే’ అని చెప్పుకోవడానికే సినీ ప్రముఖులు ఇష్టపడతారు. అది మంచి విషయమే. సినీ పరిశ్రమ అంతా ఒక్కతాటిపైనే వుందన్న సంకేతాలు, సినీ పరిశ్రమకి ఎంతో కొంత మేలు చేస్తాయి.
హీరోల మధ్య విభేదాలున్నా, దర్శకుల మధ్య ‘క్రియేటివ్ యాంగిల్లో వివాదాలు’ వున్నా, నిర్మాతల మధ్య గొడవలున్నా.. అవేవీ పైకి కన్పించవు. కానీ, ఒక్కసారి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలెట్టారంటే, ఇక ఆ ‘బూతుల పర్వం’ వినడానికి అత్యంత అసభ్యకరంగా వుంటుందన్నది నిర్వివాదాంశం. నిర్మాతలు సి.కళ్యాణ్, నల్లమలుపు బుజ్జి.. ఈ ఇద్దరూ మీడియాకెక్కి రచ్చ చేసిన వైనం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో.
‘మేం మంచి స్నేహితులం..’ అని మొదలెట్టి, ఒకరి ‘బతుకుని’ ఇంకొకరు బయటపెట్టేసుకున్నారు. కళ్యాణ్ ‘చిల్లర’ బతుకుపై నల్లమలుపు సెటైర్లు వేస్తే, నల్లమలుపు ‘నలుపు’పై కళ్యాణ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘నీ బతుకు నాకు తెలియదేంట్రా.?’ అని ఆ ఇద్దరూ ఆ స్థాయిలో రెచ్చిపోవడంతో అంతా విస్తుపోవాల్సి వచ్చింది. ఇదంతా ‘నంది’ పురస్కారాల వివాదం కారణంగానేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
‘మంచి సినిమాలు తీసి అవార్డులు సాధించాలి తప్ప.. రోడ్డెక్కి గొడవలు చేస్తే అవార్డులొస్తాయా.?’ అని సి.కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకే నల్లమలుపుకి మండిపోయింది. ‘ఒక్క హిట్ సినిమా తీసి మాట్లాడు.. ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది..’ అంటూ కళ్యాణ్కి నల్లమలుపు కౌంటర్ ఇచ్చారు. ‘నువ్వు తీసినన్ని ఫ్లాప్ సినిమాలు ఇంకెవడూ తియ్యలేడురా..’ అని సి.కళ్యాణ్ రెచ్చిపోయారు.
ఓ దశలో ‘ఆస్కార్ పనుల్లో బిజీగా వున్నా’ అని సి.కళ్యాణ్ అంటే, ‘ఆస్కారా.. ఓర్నీ ఏషాలో..’ అంటూ అసహనం వ్యక్తం చేశారు నల్లమలుపు బుజ్జి. ఇదీ ‘నంది’ పురస్కారం సినీ పరిశ్రమలో రేపిన చిచ్చుకి చిన్న ఎగ్జాంపుల్. అవార్డులు సినీ పరిశ్రమలో ఆనందాన్ని పెంచాలి.. విద్వేషాల్ని కానే కాదు. దురదృష్టవశాత్తూ ‘నంది’ సినీ పరిశ్రమలో చిచ్చు రేపింది.