మహానటిని రికమెండ్ చేసిందంటే ఏదో మతలబుంది?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంతో పాటు చూసిన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె. ఈ అమ్మడు సోషల్ మీడియాలో మహానటి పోస్టర్ ను షేర్ చేసి అందరినీ ఈ సినిమా చూడమని రికమెండ్ చేసింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఇక్కడి నుండి మన రూమర్ రాయుళ్లకు బాగా పని పడింది.

దీపికా ఈ సినిమాను సడెన్ గా చూడమని చెప్పిందంటే దీని వెనుక ఏదో కారణముంది అని రూమర్స్ మొదలయ్యాయి. ఎందుకంటే మొన్నామధ్య ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి ముందుగా దీపికాను హీరోయిన్ గా అనుకుంటున్నట్లు త్వరలోనే ఆమెను సంప్రదించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దాని తర్వాత మరో ఇద్దరు, ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా వినపడ్డాయి.

అయితే ఇప్పుడు దీపికా ఈ రకంగా పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు మహానటి సినిమా చూడటం వెనకాల కారణం నాగ్ అశ్విన్ దర్శకత్వం ఎలా ఉంటుందో చూడటానికేనా అంటూ వార్తలు మొదలయ్యాయి. దీంతో దీపికా ప్రభాస్ సరసన కన్ఫర్మ్ అన్న ప్రచారం మళ్ళీ జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి.