మహిళ దినోత్సవం స్పెషల్.. ఈ హీరోయిన్స్ చాలా స్పెషల్

ప్రపంచం నలుమూలల కూడా మహిళలను చిన్నచూపు చూడటం గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. శారీరక శ్రమ విషయంలో.. మానసిక స్థైరం విషయంలో మహిళల కంటే పురుషులు చాలా మెరుగ్గా ఉంటారు అనే అభిప్రాయం కొందరిలో ఉంది. కానీ కొందరు హీరోయిన్స్ తాము హీరోలకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. మానసికంగా.. శారీరకంగా తాము హీరోలకు సమానం అని నిరూపించారు.

ఎంతో మంది హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ హీరోల స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. సమంత యశోద ఇంకా కొన్ని సినిమాల సమయంలో చేసిన యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇటీవల కూడా ఒక వెబ్ సిరీస్ షూట్ సందర్భంగా చేతికి అయిన గాయాలను సమంత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

ఈ మధ్య కాలంలో పలువురు హీరోయిన్స్ చావు అంచుల వరకు వెళ్లి మానసికంగా దృడంగా ఉండటంతో చావుతో పోరాటం సాగించి మరీ మళ్లీ మన ముందుకు వచ్చారు. వారిలో సుస్మిత సేన్.. సమంత.. మమతా మోహన్ దాస్.. సోనాలీ బింద్రే.. హంసా నందిని ఇంకా కొందరు కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొని తిరిగి కోలుకుని ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

సుస్మిత సేన్ ఇటీవల గుండె పోటుకు గురి అయ్యారు. ఆమె ఆరోగ్యం విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఆందోళన లేదు.. కానీ ఆమె గుండె పోటుకు గురి అయిన సమయంలో చనిపోతుందేమో అనేంత టెన్షన్ పడ్డారట. ఆమె మాత్రం బతుకుతాను.. బతకాలి అనే పట్టుదలతో చావుతో పోరాటం సాగించినట్లుగా పేర్కొన్నారు.

ఇక సమంత మయోసైటిస్ అనే దీర్ఘ కాలిక సమస్యతో బాధ పడ్డ విషయం తెల్సిందే. ఆ సమయంలో సమంత కనీసం అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితులను ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితుల నుండి మానసిక ధైర్యం ను కూడగట్టుకుని సమంత ముందడుగు వేసిన విషయం తెల్సిందే.

ఇంకా మమతా మోహన్ దాస్.. సోనాలీ.. హంసా నందిని లు అత్యంత డేంజర్ క్యాన్సర్ తో పోరాటం సాగించిన విషయం తెల్సిందే. వీరంతా కూడా ప్రస్తుతం సాఫీగా సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్నారు. వారి యొక్క మానసిక స్థితి బలమైనది కనుక చాలా స్పెషల్ గా నిలిచారు.