రంగస్థలం సీక్రెట్స్‌ కొన్ని లీకయ్యాయ్‌!

రంగస్థలం ఆడియోలో ఇంతవరకు అయిదు పాటలే విడుదల కాగా, మరో పాటని మాత్రం విడుదల చేయలేదు. సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే ఆ పాటని కావాలనే రిలీజ్‌ చేయలేదు. ఆ పాటలో సినిమా కథ మొత్తం తెలిసిపోతుందట. అందుకే దానిని విడుదల చేయకుండా ఆపేసారట. అతి కీలక సన్నివేశంలో వచ్చే ఆ ఎమోషనల్‌ సాంగ్‌లో చరణ్‌ అభినయం అదిరిపోతుందట. ఈ పాటని చరణ్‌ సింగిల్‌ టేక్‌లో పూర్తి చేసాడట. ఈ పాటలోని చరణ్‌ అభినయాన్ని చూసే అతని తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారట. చరణ్‌కి అవార్డులు వస్తాయని చిరంజీవి చెప్పింది కూడా ఈ పాట గురించేనట. అయితే ఆ పాట తన అన్న పాత్ర చేస్తోన్న ఆది పినిశెట్టి చనిపోయిన తర్వాత వస్తుందా లేక ఇంకేదైనా బలమైన ఎమోషన్‌ పండించే సీన్‌ వుందా అనేది తెలీదింకా.

ఇకపోతే ‘జిగేలు రాణి’ పాట వరకు సినిమా చాలా సరదాగా సాగుతుందని, ఆ తర్వాత నుంచి వయొలెంట్‌ టర్న్‌ తీసుకుని యాక్షన్‌ మోడ్‌లోకి మారుతుందని సమాచారం. చివరి అరగంట పాటు చాలా హెవీ ఎమోషన్స్‌ వుంటాయని, ఈ చిత్రం రేంజ్‌ని డిసైడ్‌ చేసే పార్ట్‌ ఇదేనని తెలిసింది. హీరో చెవిటివాడయినా కానీ ఆ లోటు ఎక్కడా లేకుండా సినిమా అంతటా హీరోయిజం మెయింటైన్‌ చేయడం ఈ చిత్రానికి సంబంధించి మరో స్పెషాలిటీ అట.