లోకేష్.. మాటలతో కొత్త ప్రకంపనలు!

‘లోకేష్.. నీ కుటుంబానికి హైదరాబాద్ లో ఆస్తులు లేవా? మీ మామగారికి ఇక్కడ ఆస్తులు లేవా? బుద్ధి ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావా? హైదరాబాద్ లోని సినిమా వాళ్లను నాన్ రెసిడెంట్ ఆంధ్రా అంటావా? రాష్ట్రం విడిపోయాకా మీరు హైదరాబాద్ లో ఎందుకు ఇళ్లు కట్టుకున్నారు?’ ఇవీ ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబుకు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి సంధించిన ప్రశ్నావళి.

నంది అవార్డ్స్ విషయంలో వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడానికి లోకేష్ బాబు మాట్లాడిన మాటలు బ్యాక్ ఫైర్ అయినట్టుగా అగుపిస్తున్నాయి. ఒకవైపు తమ కుటుంబం ఆధార్ కార్డులు, ఓటు హక్కులను హైదరాబాద్ లోనే కలిగి.. హైదరాబాద్ లో భారీగా ఆస్తులున్నట్టుగా ప్రతియేటా చేసే ఆస్తుల ప్రకటనలో కూడా పేర్కొంటూ.. హైదరాబాద్ లోని సినీ జనం పట్ల, హైదరాబాద్ లోని సీమాంధ్రులను కించపరిచేలా మాట్లాడాడు లోకేష్ బాబు.

ఈ నేపథ్యంలో సినిమా వాళ్ల నుంచినే లోకేష్ విమర్శలను ఎదుర్కొనక తప్పడం లేదు. లోకేష్ కు బుద్ధి లేదు అని వ్యాఖ్యానించిన పోసాని.. ఇదే మనస్తత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటే ఏంటి పరిస్థితి అని ప్రశ్నించాడు. లోకేష్ లాగే తెలంగాణ వాళ్లు కూడా ఆలోచిస్తే.. ఇక్కడి ఆంధ్రులను పిచ్చికుక్కలను కొట్టేలా కొట్టేవాళ్లన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం ఆంధ్రా ప్రజలను కూడా తమ వాళ్లలాగానే భావిస్తోందన్నారు.

మొత్తానికి లోకేష్ బాబు తీవ్రంగా స్పందిస్తే.. అవతల నుంచి రియాక్షన్ కూడా తీవ్రంగానే ఉంది. నంది అవార్డ్స్ విషయంలో ఆల్రెడీ చంద్రబాబు ప్రభుత్వం వీలైనంత కంపు లేపుకుంది.. ఇప్పుడు లోకేష్ తన మాటలతో మరింత కంపు చేసినట్టున్నాడు. మరి ఏపీ ప్రభుత్వం ఖండించడానికి ఎవరూ వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో లోకేష్ మాటలపై మరింత ఘాటు స్పందన ఉండవచ్చు.