స్వర్గీయ నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. తన భర్త స్వర్గీయ ఎన్టీఆర్ సమాధి వద్ద ‘శుద్ధి’ కార్యక్రమాలు చేపట్టారు. ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమాని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి, ఎన్టీఆర్ సమాధి వద్ద లాంఛనంగా ప్రారంభించడమే అందుక్కారణం. ఎంత ఆవేశానికి లోనయ్యారంటే, లక్ష్మీపార్వతిలో ఇంత ‘ఉగ్రరూపం’ ఇంతకు ముందెన్నడూ చూడలేదనడం అతిశయోక్తి కాదనేంతలా.!
‘వాడు.. వీడు.. వెధవ..’ అంటూ లక్ష్మీపార్వతి విరుచుకుపడిపోయారు. ఓ సారి ‘వాడు. వీడు.. వెధవ..’ అన్న మాటని, ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ దర్శక నిర్మాతలపై ప్రయోగిస్తే, ఇంకోసారి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపైనా ప్రయోగించేశారు లక్ష్మీ పార్వతి. తన మాజీ భర్తపైనా ఇవే పదాల్ని ఆమె ప్రయోగించేయడం గమనార్హం. ‘నేను, స్వర్గీయ ఎన్టీఆర్ భార్యని.. నా పేరు వెనకాల ఎవడో వెధవ పేరు పెడతానంటే ఎలా.? అంటూ మండిపడ్డారు లక్ష్మీపార్వతి.
ఈ మేరకు పోలీసులకూ ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమాపై ఫిర్యాదు చేసినట్లు లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ తన ఆవేదనను అర్థమయ్యేలా చెప్పి, సినిమాపై ఫిర్యాదు చేస్తానని అంటున్నారామె. ‘ఎన్టీఆర్కి అన్యాయం జరిగిందని ఆయన కుటుంబ సభ్యుల్లోనే ఎవడైనా ప్రశ్నించారా.? నేను ప్రశ్నించాను, పోరాడుతున్నాను..’ అంటూ లక్ష్మీపార్వతి ఆవేశంతో ఊగిపోవడం గమనార్హం.
స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పటినుంచి చోటు చేసుకున్న పరిణామాల్ని, దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో తెరకెక్కించనుండగా, ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి రాకముందు ఆమె ఏంటి.? అన్నదానిపై ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమాని తెరకెక్కిస్తున్నారు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి. మరోపక్క, తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నిర్మాతగా ‘ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కనున్న సంగతి తెల్సిందే.