సినిమా ఓకే.. కానీ కండిషన్స్ అప్లయ్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నాని మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఈసారి కొత్తగా కండిషన్స్ పెట్టాడు. ఆ దర్శకుడు కిషోర్ తిరుమల. రామ్ హీరోగా ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కించాడు కిషోర్ తిరుమల. ఈనెల 27న విడుదలకానున్న ఈ సినిమా హిట్ అయితే ఛాన్స్ ఇస్తానని కండిషన్ పెట్టాడట నాని.

నిజానికి ఇలాంటి కండిషన్స్, ఈక్వేషన్స్ కు దూరంగా ఉంటాడు నాని. కథ బాగా నచ్చి, దర్శకుడు చెప్పింది తెరపై చూపించగలడని నమ్మితే చాలు కాల్షీట్లు ఇచ్చేస్తాడు. శివ నిర్వాణ, త్రినాధరావు నక్కిన, నాగ్ అశ్విన్ విషయంలో ఇలానే చేశాడు. వేణు శ్రీరామ్ కు కూడా ఇలానే అవకాశమిచ్చి, అతడి దర్శకత్వంలో ఎంసీఏ అనే సినిమా చేస్తున్నాడు. కానీ కిషోర్ తిరుమలకు మాత్రం కండిషన్స్ పెట్టడం కొత్తగా ఉంది.

ప్రస్తుతం ఎంసీఏతో పాటు కృష్ణార్జున యుద్ధం అనే మరో సినిమా చేస్తున్నాడు నాని. ఈ రెండు సినిమాల తర్వాత హను రాఘవపూడికి ఛాన్స్ ఇవ్వాలా.. లేక కిషోర్ తిరుమలకు అవకాశం ఇవ్వాలా అనే డైలమాలో పడిపోయాడు. అందుకే రామ్ సినిమాను సాకుగా చూపించి తప్పించుకున్నట్టు తెలుస్తోంది.