హీరో కాస్తా ఆ కేసుతో విలన్ కానున్నాడా?

రీల్ లైఫ్ లో హీరో కాస్తా.. రియల్ విలన్ కానున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అవుననే వాదన వినిపిస్తుండటం గమనార్హం. ఇంతకీ ఆ రీల్ హీరో ఎవరంటారా? ఇంకెవరు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు.. కోలీవుడ్ యూత్ హీరో ధనుషే . ఆ మధ్యన వృద్ధ దంపతులు.. ధనుష్ తమ కొడుకంటూ కోర్టులో కేసు వేయటం తెలిసిందే.

ఆ కేసులో భాగంగా వృద్ధ దంపతులు ధనుష్ తమ కొడుకే అనటానికి వీలుగా.. ఒంటిపై కొన్ని పుట్టుమచ్చల వివరాలు వెల్లడించారు. అయితే.. వారు చెప్పే మాటల్లో నిజం లేదని.. ధనుష్ ఒంటిపై మచ్చలు లేవన్న వార్తలు వచ్చాయి. ఇందుకు భిన్నంగా వృద్ధ దంపతుల లాయర్ ఆసక్తికర అంశాల్ని చెబుతున్నారు. తన పుట్టుమచ్చల్ని.. అత్యాధునిక చికిత్సా విధానంతో తొలగించుకున్నట్లుగా కోర్టుకు సమర్పించిన నివేదికలో రుజువైందని వెల్లడించటం సంచలనంగా మారింది.

అంతేకాదు.. కోర్టులో ధనుష్ ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్  జిరాక్స్ లో అతని పేరు లేదని.. దీంతో కోర్టుకు ఇచ్చిన సర్టిఫికేట్లు ఒరిజినల్ కావా?అన్నది సందేహంగా మారిందని చెబుతున్నారు. ప్రముఖ హీరో ధనుష్ తమ కొడుకంటూ తమిళనాడులోని మధురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్..మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతుల చెప్పినట్లుగా ధనుష్ ఒంటిపై పుట్టుమచ్చలు ఉన్నాయా? లేవా?అన్నవిషయాన్ని పరీక్షించి చెప్పాలంటూ వైద్యుల్ని కోర్టు ఆదేశించింది. ధనుష్ ను పరిక్షించిన వైద్యులు.. పుట్టుమచ్చల్ని లేజర్ చికిత్స ద్వారా రూపుమాపి ఉండొచ్చంటూ కోర్టుకు నివేదికను ఇచ్చారు. నేపథ్యంలో కోర్టు తీర్పు కానీ ధనుష్ కు   తేడాగా వస్తే.. రీల్ హీరో కాస్తా రియల్ విలన్ కావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.