వారం రోజుల్లో ఆచార్య టీజర్‌?!

‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో చిరు హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు కనిపిస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు టీజర్‌ విడుదల చేసి అభిమానులను సర్‌పప్రైజ్‌ చేయాలన్న ఆలోచనలో ఉందట చిత్రయూనిట్‌. పైగా ఆచార్య కథకు ఆ రోజు రిలీజ్‌ చేస్తేనే బాగుంటుందని సూచించారట మెగాస్టార్‌. ఇక ఖైదీ నంబర్‌ 150లో చిరుతో జోడీ కట్టిన చందమామ కాజల్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ ఇటీవలే మొదలైంది.

సైరా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని వస్తున్న సినిమా కావడంతో ఆచార్య టీజర్‌ గురించి ప్రేక్షక లోకం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. మరి ఈ టీజర్‌లో చిరుతో పాటు, చెర్రీని కూడా ఒకే దగ్గర చూపించారంటే సోషల్‌ మీడియాలో సునామీ రావడం ఖాయం. ‘ట్రెండింగ్‌ ఏ రేంజ్‌లో చేయాలో మేము చూసుకుంటాం, మీరు జస్ట్‌ టీజర్‌ వదలండి చాలు’ అంటూ అభిమానులు సంబరాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు.