పూర్తి డైలమాలో అఖిల్ అక్కినేని.!!

అఖిల్ అక్కినేని గ్రాండ్ గా తన ఎంట్రీని అఖిల్ చిత్రంతో ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా విఫలమైంది. తొలి చిత్రం ప్లాపైనా రెండో చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవ్వొచ్చు అనుకుంటే రెండో చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో చిత్రం హిట్ అవ్వలేదు. ఇక మూడో చిత్రం కూడా అదే ఫలితాన్ని అందుకుంది. mr. మజ్ను కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. ఇలా మూడు సినిమాలు విఫలమవడంతో అఖిల్ ఎలాంటి సినిమా చేయాలన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాడు.

అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత తన నాలుగో చిత్రాన్ని మొదలుపెట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ తన నాలుగో చిత్రాన్ని చేస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా కారణంగా కుదర్లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ పట్టుదలతో ఉన్నాడు.

ఇదిలా ఉంటే అఖిల్ ఐదో చిత్రం విషయంలో ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. టాలెంటెడ్ దర్శకుడు పీఎస్ మిత్రన్ అఖిల్ తో సినిమా చేయడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే ఇంకా తొలి హిట్ అందుకోని అఖిల్, ఈ టైమ్ లో ఇలాంటి విభిన్న ప్రాజెక్ట్ చేయడం కరెక్టేనా అన్న డౌట్ లో ఉన్నాడు. ఒకవేళ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ హిట్ అయితే డెసిషన్ తీసుకోవడం అఖిల్ కు సులువవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.