ఆలీ గారూ మరీ అంత గ్యాప్ వచ్చిందా

పూరి జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఆయన డైలాగులే. దర్శకుడిగా కంటే కూడా డైలాగ్ రైటర్‌గా పూరికి కుర్రకారుకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో డైలాగులు ఏ స్థాయిలో పేలుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే పూరితో ఉన్న సమస్య ఏంటంటే.. ఆయన కొన్నిసార్లు హద్దులు దాటిపోతుంటారు. ‘పోకిరి’తో పాటు కొన్ని పూరి సూపర్ హిట్ సినిమాల్లో అక్కడక్కడా కొన్ని డైలాగులు అభ్యంతరకరంగా ఉంటాయి.

‘దేశముదురు’ సినిమాలోని ‘బాగా గ్యాపొచ్చింది’ అనే డైలాగ్ కూడా ఆ కోవలోకే చెందుతుంది. సినిమాలో ఈ డైలాగ్ ఏ సందర్భంలో వస్తుందో.. ఆలీ దాన్ని ఎలా పలుకుతాడో వివరించి చెప్పాల్సిన పని లేదు. ఈ డైలాగ్ విని బాగా ఎంజాయ్ చేసినవాళ్లూ ఉన్నారు. అలాగే అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు. ఐతే ఈ డైలాగ్ అసలు పూరినే రాయలేదన్న సంగతి తాజాగా వెల్లడైంది. ‘రోగ్’ ఆడియో వేడుకలో ఆలీ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాడు.

దేశముదురు సక్సెస్ తర్వాత తాను, పూరి ఒక టీవీ ఛానెల్ లైవ్‌కు వెళ్లామని.. అప్పుడు ఒక లేడీ కాలర్ ఫోన్ చేసి.. ఏంటండీ ఆలీ గారూ మరీ అంత గ్యాప్ వచ్చిందా అని అడిగేసిందని.. జనాలు ఇలాంటి డైలాగుల్ని ఎలా ఎంజాయ్ చేస్తారో చెప్పడానికి ఇది రుజువని ఆలీ అన్నాడు. ఇక షూటింగ్ టైంలో ఆర్టిస్టులకు పూరి చాలా ఫ్రీడం ఇస్తాడని.. సీన్ ముగిసేటపుడు కొసమెరుపులాగా సొంతంగా ఏమనిపిస్తే అది చెప్పమని అంటుంటాడని.. ‘దేశముదురు’లోని ఆ డైలాగ్ అలా వచ్చిందే అని.. దీన్ని ఎడిటింగ్ లోనో.. సెన్సార్ దగ్గరో లేపేస్తారనుకున్నానని.. కానీ అది సినిమాలో అలాగే వచ్చేసిందని ఆలీ చెప్పాడు. మొత్తానికి ఆలీ ఏదో సరదాకి ఆ డైలాగ్ పేల్చితే.. అది అంత ఫేమస్ అయిపోయిందన్నమాట.