ఏపీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుక

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఏపీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రిపబ్లిక్‌ డే వేడుకలు వైభవంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ మరియు డీజీపీ సవాంగ్ గౌతమ్ మరియు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. మత విద్వేశాలను రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. అభివృద్ది కేంద్రీకరణ గతంలో ఇబ్బందులకు గురి చేశాయి. అందుకే ప్రభుత్వం అభివృద్ది వికేంద్రికరణ కోసం ప్రయత్నిస్తుందని ఈ సందర్బంగా ఆయన అన్నారు. మూడు రాజధానుల విషయమై ఈ సందర్బంగా గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.