ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఓవైసీపై ఎఫ్ఐఆర్

దేశ రాజకీయాల్లో నేతల మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవలే బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగానూ దుమారం రేపాయి. ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలను ముస్లిం దేశాలు తీవ్ర అభ్యంతరం చేశాయి. అది మరిచిపోకుముందే తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి చిక్కుల్లో పడ్డారు.

ఉద్రిక్తతలు పెంచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ ఇంటెలిజెన్స్ పోలీస్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సంచలనమైంది. ఈయనతోపాటు యతి నర్సింగానంద్ పేరును సైతం ఎఫ్ఐఆర్ లో చేర్చారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో అసదుద్దీన్ ప్రసంగిస్తూ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని ఎఫ్ఐఆర్ లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.

వీరితోపాటు సోషల్ మీడియాతో విద్వేష వ్యాక్యలు చేస్తున్న వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. జర్నలిస్టు సభా నఖ్వీ హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ పూజా శకున్ పాండే రాజస్థాన్ కు చెందిన మౌలానా ముఫ్తీ నదీమ్ అబ్దుర్ రెహ్మన్ అనిల్ కుమార్ మీనా గుల్జార్ అన్సారీలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్వేశపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం.. వివిధ గ్రూపులను రెచ్చగొటడం.. ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించే పరిస్థితులను సృష్టిస్తున్నారనే ఆరోపణలతో వీరిపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఇక ప్రవక్తపై కామెంట్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇతర సోషల్ మీడియా వినియోగదారులపై కూడా ఇదే విధమైన సెక్షన్ల కింద రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

-ఢిల్లీలో ఎంఐఎం నిరసన ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా ఎంఐఎం ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంత్ వద్ద నిరసన తెలిపింది. ఎంఐఎం మహిళా కార్యకర్తలను సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడా ఆందోళన చేశారు. నుపుర్ శర్మకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ఎంఐఎం నిరసన ప్రదర్శన నిర్వహించింది.