కెరియర్ బిగినింగ్లో సేఫ్ గేమ్ ఆడి, అన్నీ ఒకే తరహా మూస కమర్షియల్ చిత్రాలు చేయడంతో రామ్ చరణ్ తర్వాత స్ట్రగుల్ అయ్యాడు. వైవిధ్యం చూపిస్తోన్న హీరోల రేంజ్ పెరుగుతూ పోతే, చరణ్ స్థాయి మాత్రం పడిపోతూ వచ్చింది. తన తప్పు తెలుసుకుని మళ్లీ ఇమేజ్ రీబిల్డ్ చేసుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. తానూ కొత్త రకం కథలు చేయగలనని చూపించడానికి దాదాపుగా సాహసాలకే పూనుకుంటున్నాడు.
చరణ్ ప్రయత్నం ఫలించిందని చెప్పడానికి ‘ధృవ’ చిత్రం తొలిసారిగా అతనికి మిలియన్ డాలర్ల క్లబ్లో స్థానాన్నిచ్చింది. చరణ్ని చూసి కూడా ఏమీ నేర్చుకుని ఇంకో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు అదే రాంగ్ ట్రాక్లో వెళుతున్నాడు. హీరోగా నిలదొక్కుకోవడానికి మొదట్లో కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ నేటి తరం హీరోల్లా వైవిధ్యం ఇవ్వాల్సిన అవసరాన్ని మర్చిపోతున్నాడు. విన్నర్లాంటి సినిమాల వల్ల తనకి ఎలాంటి ఉపయోగం వుండదని అతను ముందే గ్రహించకపోవడం ఆశ్చర్యం.
సాయి ధరమ్ తేజ్కి కూడా ఇంతవరకు విదేశాల్లో మార్కెట్ లేదు. అతని సినిమాల్లో ఏదీ ఇంతవరకు క్లిక్ అవలేదు. విన్నర్ చిత్రాన్ని తొంభైకి పైగా లొకేషన్లలో ప్రదర్శిస్తే తొలి వారాంతంలో తొంభై వేల డాలర్లు కూడా రాలేదు. అంటే బయ్యర్లకి కనీసం ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదన్నమాట. ఈ సినిమాపై వాళ్లు పెట్టిన ప్రతి పైసా లాసేనట. బి, సి సెంటర్ల నుంచి వచ్చే గ్యారెంటీ ఓపెనింగ్ కోసమని తేజు ఇలా నాసిరకం సినిమాలు చేస్తూ పోతే తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అసలే తన జోన్లో చాలా మంది హీరోల నుంచి పోటీ వుంది కనుక అతను మరింత జాగ్రత్త పడాలి.