తప్పు చేశా.. క్షమించండి: చంద్రబాబు వేడుకోలు.!

‘నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా.? రాష్ట్రం కోసమే పరితపిస్తున్నాను.. రాష్ట్ర అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే అధికారంలో వున్నప్పుడు పార్టీ కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయాను. 25 శాతం సమయం అయినా కార్యకర్తల కోసం కేటాయించి వుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు..’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వాపోయారు.

అయినా, ‘తప్పు చేశాను.. క్షమించండి..’ అంటూ చంద్రబాబు వేడుకోవడం ఇదే కొత్త కాదు. సరికొత్తగా పాత తప్పుల్నే మళ్ళీ మళ్ళీ ఆయన చేస్తుంటారు. చంద్రబాబు హయాంలో ఓ వర్గానికే అధిక ప్రాధాన్యతనిస్తూ, సొంత నియోజకవర్గాన్ని కూడా చంద్రబాబు సరిగ్గా పట్టించుకోలేకపోయారు. సొంత సామాజిక వర్గానికి చెందిన మీడియా, అప్పట్లో చంద్రబాబుని నడిపించింది. ఆ మీడియానే చంద్రబాబుని తప్పుదోవ పట్టించింది కూడా. ఆయన ఇప్పటికీ ఆ వాస్తవాన్ని గుర్తించే స్థితిలో లేరు.

అమరావతి చుట్టూ పబ్లసిటీ స్టంట్లు చేస్తూ మొత్తంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. చంద్రబాబుని కలవాలంటే, పార్టీ కార్యకర్తలు అది సాధ్యమయ్యే పని కాదు.. ఆయన అధికారంలో వున్నప్పుడు. కార్యకర్తలే కాదు, ఓ మోస్తరు స్థాయి నేతలు కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం నానా పాట్లూ పడాల్సి వచ్చేది. పార్టీకి పనికొచ్చే నాయకుల్ని చంద్రబాబు ఎప్పుడూ ప్రోత్సహించలేదు.. తనకు ఎవరైతే బాగా భజన చేస్తారో అలాంటివారినే అందలమెక్కించారు.

అమరావతి విషయాన్నే తీసుకుంటే అప్పటి మంత్రి నారాయణ ఎంత హడావిడి చేశారు.? ఇప్పుడాయన ఎక్కడున్నారు.? ఇదొక్కటి చాలు చంద్రబాబు రాజకీయంగా ఎంతటి తప్పిదాలు చేశారో చెప్పడానికి. ఇప్పుడు ‘నేను మారాను మహాప్రభో..’ అని చంద్రబాబు ఎంత గింజుకున్నా ఆయన్ని కార్యకర్తలు సైతం నమ్మే పరిస్థితి లేదు. టీడీపీ క్యాడర్ చాలా చోట్ల అడుగంటిపోయింది.. దానికి ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలే నిదర్శనం. ‘నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా.?’ అని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నిస్తున్నారుగానీ.. ‘మీరు మాకు అవసరం లేదు..’ అని తేల్చేసే కదా.. పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకి దూరమవుతున్నది.