వద్దనుకున్న దర్శకుడితోనే చిరు సినిమా!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల ఎంపికలో జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇదిలా ఉంటే చిరంజీవి ఇప్పటికే ఆచార్య తర్వాత మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇటీవలే లూసిఫెర్ రీమేక్ ను లాంచ్ చేసారు కూడా. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు కాగా ఫిబ్రవరి మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్, బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు చిరంజీవి వివి వినాయక్ తో కూడా పనిచేయనున్నాడట. నిజానికి లూసిఫెర్ రీమేక్ ను మొదట వినాయక్ డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఇప్పుడు మరో స్క్రిప్ట్ ను వినాయక్ కు సూచించి దానిపై వర్క్ చేయమని చిరు సూచించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.