చిరంజీవి స‌తీమ‌ణి భావోద్వేగ లేఖ‌

క‌న్న‌డ హీరో చిరంజీవి స‌ర్జా ఆక‌స్మిక మృతిని అత‌ని కుటుంబ స‌భ్యులు జీర్ణించుకోలేకున్నారు. ఈ విష‌యం ఆయ‌న భార్య మేఘ‌నారాజ్ గురువారం రాసిన లేఖ వెల్ల‌డిస్తోంది. సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఆవేద‌న‌ను ఆమె పంచుకున్నారు. ఆమె రాసిన ప్ర‌తి అక్ష‌రం గుండె లోతుల్లోంచి త‌న్నుకొచ్చిన ఆవేద‌న‌గా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. వేలాది సార్లు చ‌స్తున్నంత న‌ర‌కంగా త‌న భ‌ర్త‌లేని జీవితం ఉంద‌ని ఆమె చెప్ప‌డం ద్వారా ఎంత వేద‌న అనుభ‌విస్తున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు.

చిరంజీవి స‌ర్జా 2018 మే 2న మేఘ‌నా రాజ్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భ‌వ‌తి. జూన్ 7న గుండెపోటుతో చిరంజీవి స‌ర్జా తుదిశ్వాస విడిచారు. భ‌ర్త మృతితో గుండెల నిండా ఆవేద‌న‌, మ‌న‌సంతా చిరంజీవి జ్ఞాప‌కాలు నింపుకుని, హృద‌యంతో ఆమె లేఖ రాశారు. ఆ లేఖ ప్ర‌తి హృద‌యాన్ని క‌దిలించేలా ఉంది.

“చిరు.. నీకు ఎన్నో విష‌యాలు చెప్పాల‌నుంది. నువ్వు నా ప్రాణం. కానీ ఏదో అర్థం కాని బాధ న‌న్ను ప్ర‌తీక్ష‌ణం చిత్ర‌వ‌ధ చేస్తోంది. నువ్వు లేవ‌ని గుర్తొస్తున్న ప్ర‌తిక్ష‌ణం నా మ‌న‌సు కుంగిపోతుంది. వేలాదిసార్లు చ‌స్తున్నంత న‌ర‌కంగా ఉంది. కానీ నా చుట్టూరా ఏదో మంత్రం వేసిన‌ట్లు అనిపిస్తోంది. న‌న్ను ఎంత‌గానో ప్రేమించావు. ఎప్ప‌టికీ నా చేయి వ‌ద‌ల‌నంటూ మాటిచ్చావు. కానీ ఏం చేశావు? మాట నిల‌బెట్టుకోలేక పోయావు.

మ‌న ప్రేమ‌కు గుర్తుగా నాకు పాపాయిని ఇస్తున్నందుకు నీకు ఎప్ప‌టికీ కృతజ్ఞ‌త‌లు. మ‌న‌ బిడ్డ‌గా నిన్ను మ‌ళ్లీ భూమిపైకి తీసుకొచ్చేందుకు నేను త‌హ‌త‌హలాడుతున్నాను. నీతో క‌లిసి మ‌ళ్లీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేందుకు ఎదురు చూస్తున్నాను. నీ న‌వ్వు చూసేందుకు నేనాగ‌లేకున్నా‌ను. నీ న‌వ్వుల‌తో గ‌దంతా వెలుగులు విర‌జిమ్మ‌డం కోసం ఎదురు చూస్తున్నా. నేను నీకోసం ఎదురుచూస్తూనే ఉంటా.. అలాగే నువ్వు నాకోసం ఎదురు చూస్తూ ఉండు. నా ఊపిరి ఆగి పోయేవ‌ర‌కు నువ్వు బ‌తికే ఉంటావు. ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు. ఐ ల‌వ్ యూ..” అంటూ ఆమె రాసుకొచ్చారు.