సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇంకో కరోనా పేషెంట్…

ఓవైపు తెలంగాణలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న ఆ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు లేవన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇన్ని కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం మొత్తానికి గాంధీ ఆసుపత్రి ఒక్కదాంట్లో మాత్రమే కోవిడ్ చికిత్స అందుతోంది.

గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు గురించి ప్రకటించారు కానీ.. అది అందుబాటులోకి రాలేదు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షలకు లక్షలు బిల్లులు వాయించేస్తున్నారు. దీంతో మధ్యతరగతి, పేద రోగులు ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఐతే గాంధీలోనే వసతులు అంతంతమాత్రం అని విమర్శలొస్తుంటే.. మిగతా ఆసుపత్రుల పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది.

కొన్ని రోజుల కిందటే కరోనాతో చనిపోయిన మనోజ్ అనే టీవీ జర్నలిస్టు.. గాంధీ ఆసుపత్రిలో వసతులు సరిగా లేవని.. తనను ఎవరూ పట్టించుకోలేదని చనిపోవడానికి ఒక్కరోజు ముందు వాట్సాప్ చాట్ చేసిన ఉదంతం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. తాజాగా హైదరాబాద్ ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో రవికుమార్ అనే కోవిడ్ పేషెంట్ తనకు శ్వాస అందట్లేదని.. తాను వద్దంటున్నా వినకుండా వెంటిలేటర్ తీసేశారని ఆరోపిస్తూ చివరి క్షణాల్లో సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆ తర్వాత తుది శ్వాస వదలడం కూడా కలకలకం రేపింది.

దీని తర్వాత అయినా పరిస్థితి మెరుగవుతుందనుకుంటే అలాంటిదేమీ జరగట్లేదు. అదే చెస్ట్ హాస్పిటల్లో మరో వ్యక్తి వసతుల లేమి గురించి వీడియో ద్వారా వివరిస్తూ.. ఆ తర్వాత ప్రాణాలు వదిలాడు. తన చుట్టూ బెడ్స్ ఉండగా.. అందుబాటులో వైద్య సిబ్బంది ఒక్కరూ లేని వైనాన్ని ఆ పేషెంట్ వివరించాడు. ఈ వ్యక్తి కూడా తర్వాత పరిష్థితి విషమించి చనిపోయినట్లు వెల్లడైంది. దీనిపై పేషెంట్ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతాలపై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టకపోతే ఇలాంటి మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందేమో.