తన నిర్మాణంలో వచ్చిన ‘శతమానం భవతి’కి వస్తున్న స్పందనపై ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు దిల్ రాజు. ఈ సినిమాను ఎంతోమంది పొగిడినా.. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అందించిన ప్రశంసల్ని మరిచిపోలేనంటున్నాడు రాజు. “నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి సినిమా చూడగానే ఫోన్ చేసి సినిమా గురించి చాలా బాగా మాట్లాడారు.ఒక రాజకీయ నాయకుడు సినిమాను ఇంత బాగా అనాలసిస్ చేస్తారా అనిపించింది. అంతే కాకుండా నెల్లూరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ సినిమా చూడాలని పిలుపునిచ్చారు. ఇది నాకు మరపురాని అనుభవం” అని రాజు చెప్పాడు.
“శతమానం భవతికి అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయని.. చాలా ఏరియాల్లో ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ కు వచ్చేసిందని రాజు చప్పాడు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి రెవెన్యూ నా సినిమాలు వేటికీ రాలేదనే చెప్పాలి. కృష్ణా, వైజాగ్, నైజాంలో సినిమాను మేమే రిలీజ్ చేశాం. ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో నా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్కే సినిమాను ఇచ్చేశాను. మూడో రోజుకే వాళ్లుపెట్టిన డబ్బులు వచ్చేశాయని డిస్ట్రిబ్యూటర్స్ అన్నారు. నాలుగో రోజుకు ఓవర్ఫ్లో రావడం ఆనందంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్స్లో సినిమాను విడుదల చేశాం. ఇంకా థియేటర్లు పెంచుతాం. ఓవర్సీస్లో మిలియన్ డాలర్ల క్లబ్బులోకి మా సినిమా అడుగుపెట్టేలా ఉంది” అని రాజు అన్నాడు.