దిల్‌ రాజు ‘..కళ్యాణం’ ఎవరితో?

న బ్యానర్లో హిట్టిచ్చినా, ఫ్లాపిచ్చినా కానీ ఆ దర్శకుడితో మరో సినిమా తీసే అలవాటున్న దిల్‌ రాజు ‘శతమానం భవతి’ దర్శకుడు వేగేశ్న సతీష్‌తో రెండో చిత్రానికి ప్లాన్‌ చేస్తున్నాడు. ‘శతమానం భవతి’ ముందు పలు కామెడీ చిత్రాలు ట్రై చేసిన ఇవివి శిష్యుడైన సతీష్‌ తన బలం ఫ్యామిలీ సినిమాలని తెలుసుకున్నాడు.

‘శతమానం భవతి’ అంతటి బ్లాక్‌బస్టర్‌ అవడంతో తన మలి చిత్రాన్ని కూడా అదే జోనర్‌లో చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం దిల్‌ రాజు బ్యానర్లో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే టైటిల్‌ కూడా రిజిష్టర్‌ అయింది. ఈ చిత్రంలో ఒక ప్రముఖ యువ హీరో నటిస్తాడని తెలిసింది. అయితే అది శర్వానందా, నానినా, సాయి ధరమ్‌ తేజా, వరుణ్‌ తేజా అనేది ఇంకా తెలీదు. ఈ అందరి హీరోల డేట్లు ఇప్పుడు దిల్‌ రాజు దగ్గర వున్నాయి. ఎవరితో కుదిరితే వారితో ఈ కళ్యాణం కానిచ్చేస్తాడేమో చూడాలి.

ఒక టైమ్‌లో పెద్ద సినిమాల నిర్మాణంలో చేతులు కాల్చుకున్న దిల్‌ రాజు ఇప్పుడు చిన్న సినిమాలే ఉత్తమమని రియలైజ్‌ అయ్యాడు. ప్రస్తుతం కనీసం రెండు సినిమాలు సెట్స్‌ మీద, రెండు డిస్కషన్‌ స్టేజ్‌లో పెడుతోన్న దిల్‌ రాజు ఆఫీస్‌ నిత్యం రచయితలు, దర్శకులు, బయ్యర్లతో కిటకిటలాడిపోతోంది.