సూసైడ్‌ బొనాంజా… ఫుకట్‌ పబ్లిసిటీ

వరుణ్‌ సందేశ్‌ అనేవాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడనేది కూడా చాలా కాలంగా ఎవరూ పట్టించుకోవడం లేదు. హ్యాపీడేస్‌, కొత్తబంగారులోకం లాంటి భారీ హిట్‌ చిత్రాల్లో నటించిన వరుణ్‌ సందేశ్‌ ఒక అయిదేళ్ల పాటు తెలుగు చిత్ర సీమలో బిజీగా వెలిగాడు. అయితే ఆ తర్వాత అలాంటి విజయాలు రాకపోయేసరికి వరుణ్‌ నెమ్మదిగా కనుమరుగయ్యాడు.

సడన్‌గా తన భార్య ఆత్మహత్యాయత్నం చేసిందనే న్యూస్‌తో వరుణ్‌ సందేశ్‌ వార్తల్లోకి వచ్చాడు. నిద్ర పట్టక నాలుగు నిద్ర మాత్రలు వేసుకున్నానని, అది కాస్తా వికటించి హాస్పిటల్‌ పాలయ్యానని, దానికే ఆత్మహత్య పుకార్లు పుట్టించారని అతని భార్య వితిక షేరు వివరణ ఇచ్చింది. ఇది ఆత్మహత్యా ప్రయత్నమా, లేక అమాయకత్వమా లేక ఎవరినైనా బెదిరించే యత్నమా అనేది పక్కన పెడితే, ఈ న్యూస్‌ వల్ల మళ్లీ వరుణ్‌ సందేశ్‌కి, అతని భార్యకి పబ్లిసిటీ వచ్చింది.

ఏమైపోయారో పట్టించుకోని వారిద్దరినీ మీడియా మళ్లీ వెలుగులోకి తెచ్చింది. వరుణ్‌ ఏదో వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడని, ఇతరత్రా వ్యాపార ఆలోచనలు కూడా చేస్తున్నాడని అతడికి కొత్త ఆఫర్లు తెచ్చిపెట్టేలా వితిక ఫుల్‌ పబ్లిసిటీ ఇచ్చింది. అలాగే తనకి కూడా టీవీ వ్యాఖ్యాతగా చేయాలని వుందని, దానికి తన అత్తమామలకి అభ్యంతరం లేదని కూడా చెప్పేసింది. కొత్తగా ఆపర్చునిటీస్‌ వస్తాయో లేదో కానీ పైసా ఖర్చు లేకుండా తమ జాబ్‌ ఆపర్చునిటీస్‌ కోసం న్యూస్‌ ఛానల్స్‌లో అరగంట యాడ్‌ ఇచ్చినట్టుగా ఈ సూసైడ్‌ గొడవతో ఫ్రీ పబ్లిసిటీ దొరికేసింది.