దిమ్మదిరిగే షాకివ్వబోతున్న మనీషా కొయిరాలా

90ల్లో కోట్లాది మంది కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది నేపాలీ సుందరి మనీషా కొయిరాలా. తెలుగులో ‘క్రిమినల్’ సినిమాలో కొరియాలాను చూసి ఎంతమంది కుర్రాళ్లు ఆమె దాసులైపోయారు. బాలీవుడ్లోనూ సూపర్ హిట్ సినిమాలు చేసి దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది మనీషా. తర్వాతి కాలంలో ఆమె గ్లామర్ దెబ్బ తిన్నప్పటికీ.. ఒకప్పటి మనీషాను ఊహించుకుని గాల్లో తేలిపోయేవాళ్లున్నారు ఇప్పటికీ. అలాంటి వాళ్లందరికీ మనీషా పెద్ద షాకివ్వబోతోంది.

రణబీర్ కపూర్ లాంటి థర్టీ ప్లస్ హీరోకు మనీషా కొయిరాలా తల్లిగా కనిపించబోతోంది. సంజయ్ దత్ జీవిత కథతో అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాని రూపొందించనున్న బయోపిక్‌లో మనీషా సంజూ తల్లి నర్గీస్ పాత్రను పోషించబోతోంది. ఈ చిత్రంలో రణబీర్ సంజూ క్యారెక్టర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. సంజయ్ దత్ పాత్ర కోసం బరువు పెరగడంతో పాటు తన అవతారాన్ని మార్చుకున్నాడు రణబీర్.

సంజయ్ దల్లి నర్గీస్.. నిజ జీవితంలో క్యాన్సర్ తో పోరాడి ఓడిపోయి తనువు చాలించింది. మనీషా కూడా క్యాన్సర్‌తో పోరాడటం గమనార్హం. బహుశా మనీషాతో ఈ పాత్ర చేయించడానికి కారణం కూడా అదేనేమో. ఐతే 46 ఏళ్ల వయసున్న మనీషా.. 34 ఏళ్ల రణబీర్‌కు తల్లిగా చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ రాజ్ కుమార్ ఒక పాత్రకు ఒక నటిని ఎంచుకున్నాడంటే అందుకు కారణం ఉండకపోదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే.