ఉలిక్కిపాటు – హైదరాబాదు ఖాళీ !!

నివురు గప్పిన నిప్పులా ఉన్న భాగ్యనగరం ఒక్కసారిగా టెస్టులు పెంచడంతో తన అసలు రూపాన్ని చూపించింది. పదులతో మొదలైన కేసులు వందలకు వేలకు చేరుతున్నాయి. గత వంద రోజుల్లో ఈరోజు తెలంగాణ అత్యధిక స్కోరును నమోదు చేసింది. గత 24 గంటల్లో చేసిన టెస్టుల్లో ఏకంగా 920 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11364 కి చేరింది. 737 కేసులు హైదరాబాదులోనే రావడం సంచలనం అవుతోంది. మొత్తం 24 గంటల్లో చేసిన టెస్టులు 3616. మరణాలు ఐదు.

ఇదిలా ఉండగా… సంక్రాంతి, దసరా పండుగల్లా హైదరాబాదు మహానగరం ఖాళీ అయిపోతోంది. కూలీలు, ఉద్యోగులు, శ్రామికులు, వ్యాపారులు ఇలా ప్రతి వర్గమూ మెల్లగా తమ సొంత ప్రాంతానికి వెళ్లడమో, ఇళ్లకు పరిమితం కావడమో చేస్తున్నారు. వ్యాపారాలు చాలా నామినల్ గా జరుగుతున్నాయి. ఏళ్లకు ఏళ్లుగా వ్యాపారాల్లో స్థిరపడిన హైదరాబాదు వ్యాపార కేంద్రాలు జనరల్ బజార్, బేగంబజార్, ప్యారడైజ్ సర్కిల్, పాతబస్తీ మదీనా మార్కెట్ వంటివి ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా మూసివేశారు. కార్మికుల ద్వారా తమకు, తమ ద్వారా ఇళ్లలోని వారికి వస్తుందన్న భయంతో నిరవధికంగా దుకాణాలు మూసేశారు. దీంతో హైదరాబాదు స్తంభించిపోయింది.

బేగంబజార్ అనేది ఎపుడూ బంద్ కాదు. అలాంటిది వాళ్లే స్వతంత్రంగా మూసేయడం అసామాన్యమైన విషయం. దీన్ని బట్టి కరోనా భయం జనాల్లో ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతోంది. సడలింపుల తర్వాత మరింతగా విజృంభించింది కరోనా. మహానగరంలో సరైన సమయంలో టెస్టులు చేయకపోవడం కూడా ఈ ముప్పునకు కారణమే. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా నిర్మాణ కార్యక్రమాలు కూడా కూలీలు లేక సరిగా జరగడం లేదు. ఎటుచూసినా సంక్షోభమే. పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి. వర్క్ ఫ్రం హోం కావడంతో అవకాశం ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. కొందరు శాశ్వతంగా ఖాళీ చేసి వెళ్లిపోతే, మరికొందరు తాత్కాలికంగా సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలో టులెట్ బోర్డులు కూడా బాగా పెరిగిపోయాయి.

కీలకమైన విషయం ఏంటంటే.. తొలుత కోవిడ్ నిబంధనలను లైట్ తీసుకున్న ఒవైసీయే ఇపుడు స్వయంగా కఠిన నిబంధనలు పాటించమని, ఇళ్లకు పరిమితం కామని, బయటకు రావద్దని పిలుపునిస్తున్నారు.