జ‌న సైనికుల కోసం ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది!

టాలీవుడ్ ప్ర‌ముఖ నటుడు, జ‌న‌సేనాదిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి కాసేప‌టి క్రితం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌హ‌స్తాల‌తో సంత‌కం చేసిన ఈ ప్ర‌క‌ట‌న ఆస‌క్తి రేకెత్తిస్తోంది. జ‌న‌సేన సైన్యం కోసం తాము విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌కు ఇప్ప‌టిదాకా 3,600 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని, వాటిని పూర్తిగా ప‌రిశీలించి, ద‌ర‌ఖాస్తుదారుల‌కు అర్హ‌త ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో ప‌వ‌న్ పేర్కొన్నారు.

మూడు రోజుల పాటు కొన‌సాగ‌నున్న ఈ అర్హ‌త ప‌రీక్ష‌ల‌కు ప‌వ‌న్ త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన జిల్లాగా ఉన్న అనంత‌పురం ప‌ట్ట‌ణాన్నే ఎంపిక చేశారు. ఈ నెల 21 నుంచి ఈ అర్హ‌త ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ప‌నిలో ప‌నిగా జ‌న‌సేన‌కు చెడ్డ పేరు తీసుకువ‌చ్చేందుకు య‌త్నించే వారు లేక‌పోలేద‌ని, వారితో జ‌న సైనికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కూడా ప‌వ‌న్ సూచించారు. జ‌న సైనికుల ఎంపిక‌లు అత్యంత పార‌ద‌ర్శ‌కంగానే కాకుండా ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్టే విధంగానూ ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు.

ఈ అర్హ‌త ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఆయా అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష‌ల స‌మ‌యంతో పాటు మిగిలిన వివ‌రాల‌ను ఈ- మెయిల్ ద్వారా తెలియ‌జేస్తార‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇక అనంత‌పురంలో అర్హ‌త ప‌రీక్ష‌ల కోసం ఎంపిక చేసిన వేదిక‌ను కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టంగానే పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఆ వేదిక వివ‌రాలు ఇలా ఉన్నాయి… జీఆర్ గార్డెన్స్‌, గొంగ‌డి రామ‌ప్ప కాంపౌండ్‌, మూడో రోడ్ ఎక్స్‌టెన్ష‌న్‌, ఈస్ట్ గేట్, అనంత‌పురం.