‘ఇజం’ దెబ్బ నుంచి ఇన్నాళ్లకు కోలుకుని..

‘పటాస్’ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత ఒక హిట్టు కొట్టాడు నందమూరి కళ్యాణ్ రామ్. కానీ ఆ సక్సెస్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. కొన్ని నెలల్లోనే ‘షేర్’ అనే అట్టర్ ఫ్లాప్ ఇచ్చాడు. ఆ సినిమాపై ముందు నుంచే పెద్ద ఆశలేమీ లేవు కాబట్టి నందమూరి అభిమానులు లైట్ తీసుకున్నారు. కానీ ‘ఇజం’ కళ్యాణ్ రామ్‌ను కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. తొలిసారి పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో పని చేస్తే.. ఆయన కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాపుల్లో ఒకటిగా ‘ఇజం’ను నిలబెట్టాడు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామే స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా టైమే పట్టింది కళ్యాణ్‌రామ్‌కు. ‘ఇజం’ వచ్చిన ఏడెనిమిది నెలలకు కానీ నందమూరి హీరో కొత్త సినిమా మొదలుకావట్లేదు.

ఉపేంద్ర అనే కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్తోంది. ఇద్దరు కొత్త నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ‘పటాస్’ తరహా యాక్షన్ ఎంటర్టైనర్ అట. ఉపేంద్ర ఇంతకుముందు ‘దూకుడు’, ‘ఆగడు’ లాంటి సినిమాలకు రచనా విభాగంలో పని చేశాడు. ‘పటాస్’ డైరెక్టర్ అనిల్ రావిపూడితోనూ ఉపేంద్ర కలిసి పని చేయడం విశేషం. మరి అనిల్ అలాగే ఇతనూ సక్సెస్ అవుతాడేమో చూడాలి. ముందు అతను స్క్రిప్టు రెడీ చేసింది సునీల్ కోసమట.

ఐతే కొన్ని కారణాల వల్ల అతడితో సినిమా సెట్టవ్వలేదు. తర్వాత ఈ స్క్రిప్టు వేరే హీరోల దగ్గరికెళ్లింది. చివరికి నందమూరి కళ్యాణ్ రామ్‌తో అతను సినిమా మొదలుపెడుతున్నాడు. ‘జై లవకుశ’ పనులు చూసుకుంటేనే ఈ సినిమాలో నటించనున్నాడు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది .