మాటకారితనంతో, హాస్య చతురతతో తన షోకి వచ్చిన సెలబ్రిటీ గెస్ట్లని ఇరకాటంలో పెడుతుంటాడు బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరన్ జోహార్. అయితే మొదటిసారిగా తన షోలో తనకే మాట పడిపోయేలా చేసిందో హీరోయిన్. ‘కాఫీ విత్ కరన్’ షోకి అతిథిగా వచ్చిన కంగన రనౌత్ తన జీవితంలో విలన్ అంటూ వుంటే అది కరన్ అంటూ తేల్చేసింది.
కొత్త టాలెంట్ని రానివ్వడని, ఎంతసేపు ఇండస్ట్రీలో వున్న వాళ్లనే మోస్తుంటాడని, అతనొక మాఫియా అని కంగన నవ్వుతూనే చురకలేసింది. తన బయోపిక్ అంటూ తీస్తే అందులో విలన్గా కరన్ పాత్ర పెట్టాలని, అతనే నటిస్తే ఇంకా బాగుంటుందని సూచించింది. తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన ఇంగ్లీష్ని కామెంట్ చేసాడని, అందుకే దానిపై వర్క్ చేసి ఇంగ్లీష్ మెరుగు పరచుకున్నానని కంగన చెప్పింది.
కరన్తో ఆపకుండా దర్శక, నిర్మాత ఆదిత్య చోప్రా కూడా తనని పిలిపించి ”మొదట్లో నువ్వు హీరోయిన్ ఏంటి అనుకున్నాను. కానీ నేను తప్పు అని ప్రూవ్ చేసావ్” అంటూ మెచ్చుకున్నారని ఉత్తమ నటిగా రెండు జాతీయ అవార్డులు వరుసగా గెలుచుకున్న కంగన చెప్పింది. అలాగే ముగ్గురు ఖాన్లలో ఎవరితో నటిస్తావని అడిగితే ఎవరితోను నటించనని, తనకి తగిన గుర్తింపు వుండే పాత్ర లేకపోతే సినిమా చేయనని, అది ఖాన్ల సినిమాలో కుదరదని పేర్కొంది.
కంగన వరుసగా తనని ఎటాక్ చేస్తూ వుంటే కరన్ ముఖంలో నవ్వు కూడా మాయమైంది. అంత అనుభవం వున్న వ్యక్తి కూడా ఫీలింగ్స్ దాచుకోవడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. కరన్ని కంగన అలా ఎటాక్ చేస్తోంటే కో గెస్ట్ అయిన సైఫ్ అలీ ఖాన్ కూడా షాక్ అయిపోయాడు. కంగనతో ఎప్పటికైనా కరన్ సినిమా తీసి వుండేవాడేమో తెలియదు కానీ ఈ షో తర్వాత ఇక ఆలోచన పెట్టుకోడని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడతను ఆమెతో సినిమా తీసినా, తను ఇలా పబ్లిక్గా తిట్టి పోయడం వల్లేనని జనం కామెంట్ చేస్తారు.