కంగనా రనౌత్.. డామిట్ కథ అడ్డం తిరిగింది

కంగనా రనౌత్ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది. ఇన్నాళ్లూ ఆమెకున్న మద్దతు ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతూ వస్తోంది. ఇందుకు కంగనా చేసిన ఓ కామెంటే కారణం. బాలీవుడ్ బడా బాబుల గురించి ఆమె కొన్నేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసేందే.

కరణ్ జోహార్ సహా కొందరు బాలీవుడ్ పెద్దల విషయంలో అదురు బెదురు లేకుండా కంగనా చేసే విమర్శలు, ఆరోపణలు మీడియాలో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఈ విషయంలో ఆమెకు కొన్ని వర్గాల నుంచి మంచి సపోర్ట్ కూడా ఉంది. కంగన లాంటి ఆలోచనలే ఉండి.. ఆమెలా మాట్లాడే ధైర్యం లేని వాళ్లందరూ తనకు పరోక్షంగా మద్దతిస్తూ వస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ మాఫియా గురించి, నెపోటిజం బ్యాచ్ గురించి కంగనా తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ చెలరేగిపోతోంది. ఆమె వ్యాఖ్యలకు మీడియాలో కూడా మంచి ప్రాధాన్యం లభించింది. బాలీవుడ్లోనూ పెద్ద చర్చే నడుస్తోంది.

ఇలాంటి సమయంలో తాజాగా ఆమె తాప్సి, స్వర భాస్కర్‌ల గురించి చేసిన వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడిపోయింది. వీళ్లిద్దరినీ బి-గ్రేడ్ యాక్టర్లు అనడం వివాదాస్పదమైంది. స్వర సంగతలా ఉంచితే మంచి మంచి పాత్రలు చేసి, భారీ విజయాలందుకుని అందరి ప్రశంసలు అందుకున్న తాప్సి గురించి ఈ కామెంట్ చేయడమే అందరికీ ఆగ్రహం తెప్పించింది.

దీంతో అసలు విషయం పక్కకు వెళ్లిపోయి అందరూ తాప్సి మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టారు. ఆమె ఎదుగుదల, ఘనతల గురించి చర్చ జరుగుతోంది. ఇలాంటి నటిని బి-గ్రేడ్ హీరోయిన్ అంటుందా అంటూ అందరూ కంగనా మీద పడుతున్నారు. ఆమె చేస్తున్న పోరాటం డైల్యూట్ అయిపోయింది. ఆమె ఎవరి మీద పోరాడుతోందో వాళ్లందరూ.. తాప్సి మీద కంగనా చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసి అందరి ఆమెను టార్గెట్ చేసేలా చేస్తున్నారు. మొత్తానికి ఒక చెత్త కామెంట్‌తో వ్యవహారం మొత్తం పక్కదారి పట్టేలా చేసుకుంది కంగనా.