ఈ బయోపిక్.. అంత వీజీ కాదు

కొన్నేళ్లుగా ఇండియాలో బయోపిక్స్ హవా నడుస్తోంది. ముఖ్యంగా క్రీడా దిగ్గజాల జీవిత కథలతో వరుసగా సినిమాలు వస్తున్నాయి. వాటిలో చాలా వరకు మంచి ఆదరణ కూడా పొందాయి. ఈ జానర్‌పై బాలీవుడ్ ఫిలిం మేకర్స్ బాగా పట్టు సంపాదించారు.

బాగ్ మిల్కా బాగ్, మేరీకోమ్, ఎం.ఎస్.ధోని లాంటి సినిమాలు అక్కడ చాలా బాగా ఆడాయి. దక్షిణాది స్పోర్ట్స్ సెలబ్రెటీస్ మీదా సినిమాలు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. అవి ఒక పట్టాన తేలట్లేదు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ లెజెండ్ గోపీచంద్‌పై సినిమా తీయడం కోసం మూడేళ్లకు పైగా సన్నాహాలు జరుగుతున్నాయి. అతీ గతీ లేదు.

సుధీర్ బాబు హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా అన్నారు. అదెక్కడి వరకు వచ్చిందో తెలియదు. మరోవైపు సైనా నెహ్వాల్ మీద సినిమాకు కూడా ఏర్పాట్లు జరిగాయి. అదీ ముందుకు కదల్లేదు. పి.వి.సింధు మీదా సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఈ స్పోర్స్ట్ బయోపిక్స్‌కు లీడ్ యాక్టర్లను ఎంచుకోవడమే కష్టంగా ఉంది. ఈ సినిమాలు కమర్షియల్‌గా ఏమాత్రం వర్కవుట్ అవుతాయన్నదాని మీదా సందేహాలున్నాయో ఏమో.. ప్రాజెక్టులు ముందుకు కదలట్లేదు. ఇంతలో ఇప్పుడు శ్రీకాకుళం ఉక్కు మహిళ కరణం మల్లీశ్వరి బయోపిక్ ప్రకటించారు. ఇది పక్కా తెలుగు మేకర్స్ ప్రొడక్షన్లో తెరకెక్కబోయే సినిమా. కోన వెంకట్ సమర్పణలో వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి దర్శకత్వం వహించనుంది.

ఐతే ప్రధాన పాత్రకు ఎవరినీ ఎంచుకోకుండానే ఈ పాన్ ఇండియా సినిమాను ప్రకటించేశారు. ఇప్పటికే నిత్యా మీనన్‌ను అడిగితే ఆమె నో అందట. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి పన్ను లాంటి వాళ్ల పేర్లు తెరపైకి వచ్చారు. ఈ సినిమాకు నిత్యా అయితేనే పర్ఫెక్ట్‌గా ఉండేది. రకుల్, తాప్సిలను మల్లీశ్వరిలా చూపించడం చాలా కష్టం.

మల్లీశ్వరి పాత్రకు సరైన నటిని ఎంచుకోవడం ఒకెత్తయితే.. ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడం మరో ఎత్తు. మల్లీశ్వరి ఘనత గొప్పదే అయినా.. ఆమె జీవితంలో సినిమాకు సరిపడా డ్రామా ఉందా.. ఈ కథతో ఇప్పటి ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఉంటుందా.. తెలుగు రాష్ట్రాల అవతల ఈ సినిమాపై ఏమాత్రం ఆసక్తి ఉంటుంది అన్న సందేహాలున్నాయి. మరి ఈ బయోపిక్‌కు ఏమాత్రం వర్కవుట్ చేస్తారో చూడాలి.