హైకోర్టు ప్రశ్నలకు కేసీఆర్ ఏం సమాధానం ఇస్తారు?

మాయదారి మహమ్మారి చేస్తున్న ఆరాచకం అంతా ఇంతా కాదు. కంటికి కనిపించని ఈ అతి సూక్ష్మ శత్రువును ఎదుర్కోవటం మనిషికి సాధ్యం కావట్లేదు. ప్రత్యర్థి బలహీనుడే అయినప్పటికీ.. మనిషి చేసే తప్పులతో చెలరేగిపోతున్న పరిస్థితి. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముప్పు హెచ్చరిస్తున్నప్పుడు ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇందుకు భిన్నంగా తెలంగాణ సర్కారు తీరు ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మాయదారి రోగాన్ని నిర్దారణ చేసే పరీక్షల విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న పినాసితనం ఇప్పుడో సమస్యగా మారింది. మిగిలిన విషయాల్లో దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. మాయదారి రోగ నిర్దారణకు చేయాల్సిన పరీక్షల విషయంలో మాత్రం ముందు వెనుకా ఆడటమే కాదు.. వాటికి సంబంధించిన లెక్కల విషయంలోనూ వెల్లడించని వైనం ఇప్పుడు ఇబ్బందిగా మారింది.

వలస కార్మికులకు పరీక్షలు నిర్వహిస్తే 118 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అయితే.. వ్యాధి లక్షణాలు గుర్తించేందుకు సదరు శాఖ ఎన్ని పరీక్షలు చేసిందన్న విషయాల్ని మాత్రం వెల్లడించలేదు. ఇదే విషయాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్నల్ని సంధించింది. పాజిటివ్ లు ఎన్నో వెల్లడిస్తున్న తెలంగాణ సర్కారు.. ఎన్ని పరీక్షలు చేస్తే.. ఆ ఫలితం వచ్చిందన్న విషయాన్ని తెలియజేయకుండా ఉండటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.

ఏపీ.. మహారాష్ట్ర.. కేరళ తదితర రాష్ట్రాలు ప్రతి పది లక్షల మందికి రెండు వేల నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం పదిలక్షల మందిలో 518 మందికే పరీక్షలు నిర్వహించటంలో ఉన్న లాజిక్ ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికి పలుమార్లు ఇదే ప్రశ్నను సంధిస్తున్నా.. సూటి సమాధానం రాని పరిస్థితి.

అంతేకాదు.. మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించరాదని ఏప్రిల్ లో రెండుసార్లు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయటం కూడా సరికాదంటూ హైకోర్టు తప్పు పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా మరణించినప్పుడు.. సదరు వ్యక్తిని పరీక్షించి అది కరోనా మరణమా? కాదా? అన్న విషయాల్ని తేలిస్తే.. ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మీద ఒక అవగాహన రావటమే కాదు.. వారి కారణంగా వేరే వారికి వ్యాపించకుండా చెక్ పెట్టే వీలుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా మరణించినవారికి పరీక్షలు జరపొద్దన్న తెలంగాణ సర్కారు నిర్ణయం సరికాదంటున్నారు.