చివరికి జగన్ రూట్లోకే వచ్చిన కేసీఆర్

కరోనాపై పోరాటంలో మొదట తెలంగాణ ప్రభుత్వం ప్రశంసల్లో మునిగి తేలింది. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం మీద అనేక విమర్శలొచ్చాయి. కానీ తర్వాత కథ మారింది. తెలంగాణలో కరోనా పరీక్షలు దేశంలోనే అతి తక్కువగా చేయడం, ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి, ఇతర కారణాలతో తెలంగాణ సర్కారు విమర్శలు ఎదుర్కోవడం మొదలైంది.

అదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం కరోనాపై పోరాటంలో చురుగ్గా వ్యవహరించడం, పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం, దీనిపై జాతీయ మీడియాలోనూ చర్చ జరగడం, చివరికి ప్రతిపక్ష పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ సైతం జగన్ సర్కారను అభినందించడం తెలిసిన సంగతే. తెలంగాణ ప్రభుత్వం ఐసీఎంఆర్ సూచించిన ఆర్టీ-పీసీఆర్ పద్ధతిలోనే పరీక్షలు చేస్తూ వచ్చింది. ఆ పరీక్షలు ఖర్చుతో, శ్రమతో కూడుకున్నవి. ఫలితాలు రావడానికి కూడా మూణ్నాలుగు రోజులు సమయం పడుతుంది.

ఐతే జగన్ ప్రభుత్వం చాలా ముందుగానే ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ కిట్స్ తెప్పించి విరివిగా టెస్టులు చేయడం మొదలుపెట్టింది. అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు అందరికీ టెస్టులు చేస్తూ పోయింది. ఈ మధ్యే పది లక్షల టెస్టుల మార్కును కూడా దాటేసింది ఏపీ. ఐతే ర్యాపిడ్ టెస్టుల ప్రామాణికతపై ముందు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చిన తెలంగాణ సర్కారు.. హైకోర్టు ఆదేశాలు, జనాల డిమాండ్ల నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచడానికి ర్యాపిడ్ టెస్టులనే ఆశ్రయించక తప్పలేదు.

నిన్న, శుక్రవారం తెలంగాణలో పది వేలకు పైగా టెస్టులు చేయడం విశేషం. వీటిలో మెజారిటీ పరీక్షలు ర్యాపిడ్ కిట్స్‌తో చేసినవే. ప్రభుత్వం ఇటీవలే 2 లక్షల దాకా ర్యాపిడ్ కిట్లు తెప్పించినట్లు సమాచారం. వాటితో రెండు వారాల వ్యవధిలో రెండు లక్షల టెస్టులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇక రోజూ కనీసం పదివేలకు తక్కువ కాకుండా టెస్టులు చేస్తారట. టెస్టుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయి.