24 గంటలూ మంచి నీరు, హైదరాబాద్ ను కాలుష్యరహితంగా చేస్తా: సీఎం కేసీఆర్

‘తెలంగాణ వాళ్లు తెలంగాణను పరిపాలించలేరు అనే విమర్శలు.. హైదరాబాద్ ఖాళీ అవుతుందని కొందరి ప్రచారం.. వీటన్నింటినీ దాటుకుని తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నాం. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కు పట్టం కట్టండి.. హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

ఓటు వేసేముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. ప్రభుత్వం ఎలా పనిచేస్తోందనే చర్చ ప్రజల్లో జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి మంచిది. ఇది మెచూర్యుడ్ డెమోక్రసీ. అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ మరింత మెచ్యూరిటీగా వ్యవహరించింది. హైదరాబాద్ లో ఉన్నవారంతా మావాళ్లే అనుకున్నాం. తెలంగాణలో విద్యుత్ సమస్యను జయించి కోతలు లేకుండా చేశాం. దేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది.

హైదరాబాద్ లో 24 గంటల నీటిసరఫరా జరిగేలా ఏర్పాటు చేస్తాం. అపార్ట్‌మెంట్ వాసులకు కూడా 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తాం. ఛాలెంజ్ చేసి, తొడగొట్టి మరీ మిషన్ భగీరథ పూర్తి చేశాం. దోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. హైదరాబాద్ అశాస్త్రీయంగా పెరగడానికి కారణం గత ప్రభుత్వాల తీరే. ఢిల్లీ లాంటి పరిస్థితి మనకు రాకుండా హైదరాబాద్ ను కాలుష్యరహితంగా చేయాలి. మూసీనదిని ప్రెజంట్ చేసే బాద్యత నాది. హైదరాబాద్ నిర్మాణ బాధ్యతను నేను తీసుకుంటా.

ఆరేళ్లుగా శాంతిభద్రతల విషయంలో రాజీపడలేదు. సీసీ కెమెరాల వినియోగంలో హైదరాబాద్ నెంబర్ వన్. వరదలకు పేదల బతుకులు చూసి బాధపడ్డాను. వరదలు వచ్చిన ఏ నగరంలోనూ ప్రభుత్వాలు సాయం చేయలేదు. ఏ నగరంలోనూ ఇవ్వనివిధంగా 6.5 లక్షల మందికి 650 కోట్లు ఇచ్చాం. ఈసీకి కంప్లైంట్ చేసి కొందరు వరదసాయం బంద్ చేయించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మా ప్రభుత్వమే ఉంటుంది. డిసెంబర్ 7 నుంచే వరదసాయం మళ్లీ ప్రారంభిస్తాం. అర్హులైన ప్రతికుటుంబానికి వరదసాయం ఇచ్చే బాధ్యత నాది.

హైదరాబాద్ మునిగిందని మోడీని రూ.1300 కోట్లు అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదు. ఇలాంటి వారిని ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలి. వరదసాయం ఇవ్వలేదు కానీ, వరదలా నేతలు వస్తున్నారు. ఈ బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంతమందా? రెండు జాతీయ పార్టీలు దేశాన్ని నడపడంలో విఫలమయ్యాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ మోస రాజకీయాలు నడిపిస్తారు? ఫ్రంట్ పెడతానని నేను చెప్పానా? కేసీఆర్ వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా! అందుకే హైదరాబాద్ కు నేతలంతా వరదలా వస్తున్నారు. ఎల్ఐసీ, బీహెచ్ఈఎల్, రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారంటే తప్పు అంటున్నారు.

యోగి ఆదత్యనాధ్ దగ్గరే సరిగ్గాలేదు.. మనదగ్గరకు వచ్చి నీతులు చెబుతాడా. 28వ ర్యాంకర్ వచ్చి 5వ ర్యాంకర్ కు వచ్చి చెబుతాడా? పక్క రాష్ట్రంవాడు వచ్చి ఏదో ముచ్చట చెప్పి పోతాడు? ఈ వంచకుల మాటలు విని మోసపోవద్దు