కేసీఆర్ డిసైడ్: హుస్సేన్ సాగర్ ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం

తెలంగాణ రాష్ట్రంలోని దళితులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం.. బృహత్తర ప్రాజెక్టుకు త్వరలోనే కార్యరూపం తేబోతోంది. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో రూ.100 కోట్ల వ్యయంతో రాజ్యాంగ నిర్మాత భారత రత్న బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ భారీ అంబేద్కర్ విగ్రహం 11 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పనులను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పరిశీలించారు.

ఈ విగ్రహం కింది భాగంలో 50 అడుగుల మేర పార్లమెంట్ ఆకృతిలో ఓ భవంతి ఉంటుందని.. దానిపైన విగ్రహ నిర్మాణం ఉంటుందని వివరించారు. గరిష్టంగా 15 నెలల కాలంలో ఈ విగ్రహం నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

అంబేద్కర్ గొప్పదనాన్ని ప్రతిబింబించేలా విగ్రహ నిర్మాణం ఉంటుందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సువిశాలమైన స్థలంలో అంబేద్కర్ పార్కును నిర్మించబోతున్నామని తెలిపారు. విగ్రహంతోపాటు మ్యూజియం లైబ్రరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారని తెలిపారు. విగ్రహం వెడల్పు 45.5 ఫీట్లు ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.

దేశంలో గుజరాత్ నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తర్వాత దేశంలో ఇదేఎత్తైన విగ్రహం కానుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ధ్యానమందిరం సమావేశ మందిరం లేజర్ షో క్యాంటీన్ సువిశాలమైన పార్కింగ్ వాష్ రూంలు నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ఇక్కడ స్కిల్స్ డెవలప్ మెంట్ వర్క్ షాపులు సెమినార్లు జరుగుతాయన్నారు. ఇది రాష్ట్రంలోనే ముఖ్య పర్యాటక ప్రదేశంగా వెలుగొందనుందని.. ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోందని వివరించారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతోపాటు అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని ఇనుమడించే విధంగా నగరానికి మరింత వన్నె తెచ్చే విధంగా దీని నిర్మాణం ఉంటుందన్నారు.