నాని క్లారిటీ ఉన్నా.. భాష నాట్ ఓకే

ఏపీ పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. అనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడం….విపక్షాలపై…ప్రత్యేకించి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేయడం వంటి విషయాల్లో కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

మంత్రి కొడాలి నాని భాష కొంత అభ్యంతరకరంగా ఉన్నా…. విషయం మాత్రం సూటిగా ఉంటుందని టాక్ ఉంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (APSEC)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టబోతున్న నేపథ్యంలో నాని తన మార్క్ కామెంట్స్ తో మరోసారి వార్తల్లోనిలిచారు. ఎస్ ఈసీగా రమేష్ కుమార్ వచ్చినా…ప్రభుత్వానికి ఢోకా ఏమీ లేదని, ఆయన చిటికెన వేళ్ల మీద వెంట్రుకలు కూడా పీకలేరని ఒకింత ఘాటుగానే విమర్శలు గుప్పించారు నాని.

గుడివాడలో రైతు భరోసా భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా.. ప్రజలకు మంచి చేసి తీరుతామన్నారు. ఏపీ ఎస్ఈసీగా రమేష్ కుమార్ టీడీపీ కనుసన్నల్లో వ్యవస్థల్ని నడిపిన విషయాన్ని హైకోర్టు లెక్కలోకి తీసుకోలేదని నాని విమర్శించారు.

హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని, నిమ్మగడ్డ కేసుకు సంబంధించి న్యాయ‌ నిపుణుల‌తో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. అయితే, హైకోర్టులో నిమ్మగడ్డ కేసు విచారణ మొదలైనపుడు కూడా నాని మీడియా ముందు ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. ఇపుడు, నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చినపుడూ అదే తరహాలో మాట్లాడారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరైనా సరే ఎన్నికల సమయంలో ఫిర్యాదులు రావడం,…వాటిపై చర్యలు తీసుకోవడం కామన్. అధికార పార్టీ గనుక నిమ్మగడ్డ వచ్చినంత మాత్రాన నష్టమేమీ లేదన్న భావనతో నాని ఈ తరహాలో కామెంట్స్ చేసి ఉంటారు.

అయితే, మంత్రిగారు చెప్పదలుచుకున్న విషయంలో క్లారిటీ ఉన్నా….చెప్పిన భాష మాత్రం అభ్యంతరకరంగా ఉందని చెప్పవచ్చు. మంత్రిగారి మాటల కంటే భాషతోనే సమస్య. ఈ పీకటాలు లాగడాలు లేకుండా….చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న సినిమా డైలాడ్ కొడితే పాష్ గా ఉండేది. మరి, భవిష్యత్తులోనైనా…. మంత్రి నాని భాష మారుతుందేమో చూడాలి.