క్రిష్ కన్ఫమ్ చేసేశాడు..

‘కంచె’ సినిమాతో ఒక్కసారిగా ఎన్నో మెట్లు ఎక్కేశాడు క్రిష్. ఆ తర్వాత అతడితో పని చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపించారు. ఐతే ‘కంచె’ హీరో వరుణ్‌తేజ్‌తోనే ‘రాయబారి’ అనే ఇంకో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుని.. ఆ తర్వాత అనుకోకుండా నందమూరి బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేశాడు క్రిష్. ఈ సినిమా అద్భుతమైన స్పందన రాబట్టుకుని.. క్రిష్‌కు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడిక క్రిష్ తర్వాతి సినిమా ఏదా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనాలు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి క్లారిటీ ఇచ్చాడు క్రిష్.

బాలయ్య తర్వాత మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేయబోతున్నాడట క్రిష్. ఇది ఒక సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతుందని కూడా క్రిష్ చెప్పాడు. రానా దగ్గుబాటితో చేసిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాను నిజానికి తాను వెంకీ కోసమే అనుకున్నానని.. కొన్ని కారణాల వల్ల అది రానాతో చేశానని ఈ సందర్భంగా క్రిష్ వెల్లడించాడు. మరోవైపు బాలీవుడ్లోనూ తనకు ఓ కమిట్మెంట్ ఉందని.. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ హీరో అక్షయ్ కుమార్‌తో ఆ సినిమా ఉంటుందని క్రిష్ తెలిపాడు. ఐతే వీటిలో ఏది ముందో.. ఏది వెనకో మాత్రం క్రిష్ వెల్లడించలేదు. ప్రస్తుతం వెంకీ.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ మీకు జోహార్’ సినిమా చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతానికి అది హోల్డ్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు పూరి జగన్నాథ్‌తో సినిమా కోసం డిస్కషన్స్ సాగిస్తున్నాడు వెంకీ. మరి వెంకీ-క్రిష్ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో చూడాలి.