వరుసగా పవన్కళ్యాణ్, చిరంజీవి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసిన లక్ష్మిరాయ్ ఇప్పుడు ఇలాంటి ప్రత్యేక గీతాలకి పేరు గడించింది. సర్దార్ గబ్బర్సింగ్ ఫ్లాప్ అయినా కానీ అందులో ఆమె చేసిన తోబ తోబా పాట మాస్ని ఊపేసింది. ఇక రత్తాలు సంగతి చెప్పనే అక్కర్లేదు.
ప్రస్తుతం ఎవరినోట విన్నా అదే పాట నానుతోంది. చిరంజీవి రీఎంట్రీలో ఫస్ట్ సాంగ్ కావడంతో ఫాన్స్ ఈ పాట వచ్చినప్పుడు చేస్తోన్న రచ్చ అలా ఇలా ఉండట్లేదు. రత్తాలుతో ఒక్కసారిగా లక్ష్మిరాయ్పై అందరి కళ్లు పడుతున్నాయి. ఇంతకుముందు ఐటెమ్ సాంగ్ అంటే పాపులర్ హీరోయిన్లవైపు చూసిన వాళ్లంతా ఇప్పుడు ఐటెమ్ సాంగ్ స్పెషలిస్ట్ అయిన లక్ష్మి రాయ్ కోసం ఎంక్వయిరీలు చేస్తున్నారు.
మెగా కాంపౌండ్లో సందడి చేసి వచ్చిన లక్ష్మిరాయ్ ఇప్పుడు నందమూరి క్యాంప్లో రచ్చ చేయడానికి సిద్ధమవుతోంది. ఎన్టీఆర్తో బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జై లవకుశ’ చిత్రంలో లక్ష్మిరాయ్ ఐటెమ్ సాంగ్ చేస్తున్నట్టు సమాచారం. సర్దార్ గబ్బర్సింగ్ దర్శకుడే కనుక బాబీనే లక్ష్మి రాయ్ పేరు సిఫార్సు చేసి ఉండొచ్చు.
ఐటెమ్ సాంగ్ స్పెషలిస్టులు ఈమధ్య తక్కువైపోతున్నప్పటికీ లక్ష్మిరాయ్ మాత్రం వరుసగా అలాంటి ఆఫర్లతో కదం తొక్కుతోంది. యంగ్టైగర్తో రత్తాలు వేసే చిందులకి మరోసారి మాస్ జనాల చొక్కా బొత్తాలు ఊడిపోవడం గ్యారెంటీ.