శ్రీమంతుడ్ని వదలని ‘అతడు’

అతడి పోరాటం ఫలించింది. రెండేళ్లుగా తనదైన కథను తీసుకొని శ్రీమంతుడి సినిమాను చేశారంటూ రచయిత శరత్ చంద్ర చేస్తున్న పోరాటం తెలిసిందే. అతగాడి పోరాటం తాజాగా ఒక కొలిక్కి వచ్చింది. తన కథను కాపీ కొట్టారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రైవేటు పిటీషన్ పై విచారణ చేసిన న్యాయమూర్తి తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

మహేశ్ బాబు.. కొరటాల శివ.. నవీన్ లను నాంపల్లి కోర్టుకు హాజరుకావాలంటూ న్యాయమూర్తి ఆదేశించారు. ఐదేళ్ల క్రితం తాను ఒక వీక్లీలో ‘చచ్చేంత ప్రేమ’ పేరుతో నవల రాశానని.. దాన్నే శ్రీమంతుడిగా తెరకెక్కించారన్నది రచయిత ఆరోపణ. దీంతో.. వీరిపై కాపీరైట్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.

కోర్టుకు రావాలంటూ ఆదేశాలుజారీ చేశారు. సినిమా విడుదలై.. సూపర్ హిట్ కావటం.. ఆ సందర్భంగా సంబరాలు పూర్తి చేసుకోవటం కూడా అయిపోయింది. కానీ.. కాపీ కొట్టారన్న ఆరోపణ మీద మాత్రం పోలేదు. అది కాస్తా ఇప్పుడు మరింత పెద్దదై.. కోర్టు వెళ్లే వరకూ చేసింది. మరి.. దీనిపై మహేశ్ ఎలా రియాక్ట్ అవుతారో..?