మహేష్‌ ‘సర్కార్‌ వారి పాట’ పాడనున్నాడా?

గీత గోవిందం చిత్రంతో దర్శకుడిగా సూపర్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు పరశురామ్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న వీరిద్దరి కాంబో మూవీ లాక్‌ డౌన్‌ పూర్తిగా ఎత్తి వేసిన తర్వాత ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే ఈ నెల 31న సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సినిమాను ప్రకటించాలని నిర్ణయించారు. అదే సమయంలో టైటిల్‌పై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సర్కార్‌ వారి పాట అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీతో రూపొందుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ చివరి దశలో ఉండగా త్వరలోనే సినిమా నటీనటుల ఎంపిక జరుగబోతుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో హిట్‌ కొట్టిన మహేష్‌ బాబు ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

గీత గోవిందం చిత్రం తర్వాత పలువురు హీరోలకు కథలు వినిపించిన దర్శకుడు పరశురామ్‌ చివరకు మహేష్‌ బాబుతో సినిమాకు రెడీ అయ్యాడు. మహేష్‌బాడీ లాంగ్వేజ్‌ మరియు ఆయన స్టార్‌డంకు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ స్క్రిప్ట్‌ వ్యవహారంలో మెహర్‌ రమేష్‌తో పాటు పలువురు రచయితలు ఇన్వాల్వ్‌ అయ్యారట. టైటిల్‌ విభిన్నంగా సర్కారు వారి పాట అంటూ ఉండటంతో అంతా కూడా సినిమాపై అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. 31వ తారీకున క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.