ముంబైలో దారుణం.. నటిపై కత్తితో దాడి చేసిన నిర్మాత..

సోషల్ మీడియా పరిచయం ఓ నటి ప్రాణం మీదకు తెచ్చింది. స్నేహం పేరుతో ఆమెతో పరిచయం చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఆ వెంటనే పెళ్ళి ప్రపోజల్ తీసుకొచ్చాడు. అందుకు ససేమిరా అంటూ అతనితో మాట్లాడటం మానేసింది. సోషల్ మీడియా అకౌంట్ నుంచి బ్లాక్ చేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకుని కత్తితో పొడిచి హత్యా ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఆ నటి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ముంబైలో మాల్వి మల్హోత్రా ఒక టీవీ నటి. యోగేశ్ కుమార్ మహిపాల్ సింగ్ ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. తనను తాను ఓ నిర్మాతగా చెప్పుకున్నాడు. స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆమె వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇందుకు మాల్వీ అంగీకరించలేదు. యోగేశ్ నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంలో అతనితో మాట్లాడటం మానేసింది. సోషల్ మీడియాలో యోగేశ్ ను బ్లాక్ చేసింది. దీంతో యోగేశ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అక్టోబర్ 26 సోమవారం రాత్రి మాల్వీని అనుసరించాడు.

ఓ కేఫ్ నుంచి బయటకొస్తున్న మాల్విని అడ్డగించాడు. ఎందుకు మాట్లాడటం లేదని అడగ్గా.. తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో కోపంతో మాల్విపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆమె ఛాతీ కింది భాగంలో మూడు సార్లు పొడిచాడు. ఆమె చేతులకు కూడా గాయాలయ్యాయి. తాను వచ్చిన లగ్జీరీ కారులోనే నిందితుడు పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. నిందితుడిపై వెర్సోవా పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి.. యోగేశ్ కోసం గాలింపు చేపట్టారు.

Share