MAA లో మహిళా సాధికారత గ్రీవెన్స్ సెల్

నువ్వా నేనా? అంటూ సాగిన పోటీలో ప్రకాష్ రాజ్ పై స్పష్ఠమైన మెజారిటీతో గెలిచారు మంచు విష్ణు. అధ్యక్షుడిగా పదవిని చేపట్టారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు తన కార్యాచరణలో భాగంగా దూకుడు చూపించడం చర్చనీయాంశమైంది. ఇంతకుముందే ఆయన ఒక గుడ్ న్యూస్ చెబుతానని తెలిపిన సంగతి తెలిసిందే. అతడు చెప్పినట్టుగానే.. ఓ కీలక విషయాన్ని వెల్లడించాడు. పరిశ్రమలో మహిళల సమస్యలను పరిష్కరించడానికి మహిళా సాధికారత .. గ్రీవెన్స్ సెల్ (WEGC) ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కమిటీకి సలహాదారుగా సునీతా కృష్ణన్ ను నియమించారు. ఈ విషయాన్ని విష్ణు తన ట్విట్టర్ లో ధృవీకరించారు. విష్ణు స్పందిస్తూ.. MAA అసోసియేషన్ లో మహిళా శక్తిని పెంచుతున్నామని WEGCపై విష్ణు ప్రకటించారు.

ట్వీట్ లో వెల్లడిస్తూ.. MAA -WEGC మహిళా సాధికారత మరియు గ్రీవెన్స్ సెల్ ని రూపొందిస్తున్నందుకు గర్వపడుతున్నాను.. అని అన్నారు. ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా వచ్చినందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి సునీతా కృష్ణన్ కి కృతజ్ఞతలు. ఈ కమిటీలో నలుగురు మహిళలు ఇద్దరు పురుషులు ఉంటారు. త్వరలో కమిటీ సభ్యులను ప్రకటిస్తాం. ఎక్కువ మంది మహిళలను సభ్యులుగా స్వాగతించడం `మా` లక్ష్యం. WEGC అనేది మా కుటుంబాన్ని రక్షించే మొదటి అడుగు. మహిళలకు మరింత శక్తి ఇది.. అని అన్నారు.

విష్ణు ముందు గురుతర బాధ్యత ఎంతో ఉంది!

మంచు విష్ణు కొత్త అధ్యక్షుడు అయ్యాక అతడి ముందు ఎన్నో సవాళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మా భవంతి నిర్మాణం అనేది పెను సవాల్ అనడంలో సందేహమేం లేదు. నిజానికి ఎన్నికల్లో ప్రకటనలు గుప్పించినంత వీజీ కాదు బిల్డింగ్ నిర్మించడం అంటే… అది భారీ పెట్టుబడితో కూడుకున్నది. `మా` నుంచి ప్రత్యర్థి ప్యానల్ సభ్యుల సహకారం చాలా ముఖ్యం. 2021-23 సీజన్ కి MAA అధ్యక్షుడిగా కొనసాగే క్రమంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎన్నో ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో `మా` భవంతి నిర్మాణంతో పాటు అసోసియేషన్ సభ్యుల కోసం ఏం చేస్తున్నారు? సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా ఉంది? వృద్ధ ఆర్టిస్టులకు ఫించన్లు.. అభివృద్ధికి నిధి సేకరణ కార్యక్రమాలు ఇలా ఎన్నో విషయాలు చర్చకు రానున్నాయి. ఇకపోతే మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తున్నారు కాబట్టి వచ్చే సీజన్ కి కచ్ఛితంగా ఒక మహిళనే నిలబెట్టేందుకు విష్ణు ప్రాధాన్యతనిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

వివాదాలు సమసిపోయేదెప్పటికి?

రెండేళ్లు కొత్త అధ్యక్షుడిని నిద్రపోనివ్వనని మోనార్క్ ప్రకాష్ రాజ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాల్ని వెల్లడించారు ప్రకాష్ రాజ్. ఈ ఎన్నికలు అప్రజాస్వామికమని .. పోల్ మేనేజ్ మెంట్ చేశారని.. ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఎలక్షన్ ని మ్యానిప్యులేట్ చేశారనేది ఆయన వాదన.

పెద్దరికాలని ప్రశ్నిస్తున్నాను. ఎటు వెళ్లినా వీడు డేంజరే అనేలా చేస్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఆర్టిస్టులు రావాలని మంచు విష్ణు అంటున్నాడు.. ఈ రెండేళ్లు నిదురపోనివ్వను.. ప్రశ్నిస్తూనే వుంటాను. ప్రతీవారం రిపోర్ట్ కార్డ్ అడుగుతాను. పని నువ్వు చేస్తావా? నన్ను చేయమంటావా? అని నిలదీస్తాను. ఎవ్వరినీ ప్రశాంతంగా వుండనివ్వను.. మనుషులు మారాలి… `మా `మారాలి `ని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసినదే. కుటుంబం కుటుంబం అనే వారిని నమ్మకూడదని కుండ బద్దలు కొట్టారు. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా వుండాలన్నారు. మార్పు రాకపోతే మరో `మా` వస్తుందన్నారు. గొడవలు పడుతూ మనమంతా ఒకే కుటుంబం అంటున్నారు. కానీ నేను అది నాన్సెన్స్ అంటున్నాను.. అంటూ ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.